సుల్తానాబాద్, డిసెంబర్ 2: క్రీడాకారులకు, క్రీడా వేదికలకు నిలయమైన సుల్తానాబాద్లో రాష్ట్ర స్థాయి జూడో సంగ్రామానికి సిద్ధమైంది. ఈ నెల 5, 6న సుల్తానాబాద్లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో రాష్ట్రస్థాయి జూడో సబ్-జూనియర్ విభాగంలో బాలబాలికలకు పోటీలు నిర్వహించనుండగా, అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా జూడో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాటేటి సంజీవ్, సిలివెరి మహేందర్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్తాల రవీందర్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం విలేకరులతో సమావేశం నిర్వహించి, మాట్లాడారు.
ఆత్మైస్థెయిర్యానికి, ఆత్మవిశ్వాసానికి జూడో క్రీడ దోహదపడుతుందన్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా రాష్ట్రస్థాయి పోటీలకు సుల్తానాబాద్ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. పోటీలకు రాష్ట్రంలోని దాదాపు 300 మంది క్రీడాకారులు, 50 మంది అధికారులు పాల్గొంటారని తెలిపారు. వీరందరికీ ఉచిత భోజన, వసతి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. బాలబాలికల విభాగాల్లో మొత్తం 18 వెయిట్ కేటగిరీలలో 72 పతకాలకు పోటీలను జరుగనున్నట్లు పేర్కొన్నారు.
ఈ పోటీల్లో బంగారు పతకాలను సాధించిన క్రీడాకారులను ఈ నెల 15 నుంచి 18 వరకు కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో జరుగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ పోటీల విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇక్కడ పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణప్రియ, సుల్తానాబాద్ క్రీడా సమాఖ్య కార్యదర్శి దాసరి రమేశ్, మాజీ ఎస్జీఎఫ్ కార్యదర్శి అంత టి శంకరయ్య, కుమార్ కిషోర్, యెల్లె రాజు, పీఈటీలు ఇక్బాల్, సత్యానారాయణ, శివ ఉన్నారు.