కొడిమ్యాల, డిసెంబర్ 23 : కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వడ్లు కొంటదా? లేదా? తేల్చకుండా, మంత్రులు వెళ్లి కలిసినా సమాధానం చెప్పకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో పలువురికి కల్యాణ లక్ష్మి చెక్కులు, క్రైస్తవులకు దుస్తులు, అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో రైతుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తుంటే యాసంగి వడ్లను కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నదన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి ఎంత దూరమైనా వెళ్తామన్నారు. కల్యాణ లక్ష్మి పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మండలంలో తొమ్మిది మందికి చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరుతున్నదన్నారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అంగన్వాడీ టీచర్లకు వేతనాలు పెంచడంతో పాటు గుర్తింపు ఇచ్చినట్లు చెప్పారు. 62 మందికి ఫోన్లు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ పర్లపల్లి ప్రసాద్, తహసీల్దార్ స్వర్ణ, సీడీపీవో నర్సింగరాణి, సూపర్వైజర్ శ్రీలత, మమత, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులి వెంకటేశం గౌడ్, ఎంపీటీసీ సభ్యులు ఉట్కూరి మల్లారెడ్డి, బసనవేని మహేశ్, సర్పంచ్ పిల్లి మల్లేశం, నాయకులు రోడ్డ శరత్, నేరెళ్ల మహేశ్, సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, చీకట్ల మహేందర్గౌడ్, కొత్తూరి స్వామి, గుండు రాజుకుమార్, దేవయ్య తదితరులున్నారు.