కలెక్టరేట్, జనవరి 27 : మారిన పరిస్థితుల్లో వృద్ధాప్యం శాపంగా మారింది. మలిసంధ్య వేళ ఆదరణకు నోచుకోక తీవ్ర మనోవేదనకు గురవుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు వారికి అండగా నిలువాలని తలంచింది. వృద్ధుల సంక్షేమానికి చర్యలు చేపట్టింది. దారి తప్పిన సంతానాన్ని దారిలో పెట్టేందుకు ఉపక్రమించింది. తెలంగాణ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ను రూపొందించింది. సీనియర్ సిటిజన్స్ చట్టానికి కీలక సవరణలు చేసింది. గతంలో గిఫ్ట్ డీడ్ చేసిన ఆస్తులను మాత్రమే వెనక్కి తీసుకొనే అవకాశముండేది. అయితే, సవరించిన చట్టం ప్రకారం స్థిర, చరాస్తులను సైతం తిరిగి పొందేందుకు అవకాశం కల్పించింది. ఆలనాపాలనా చూడని కొడుకు, కోడళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా ట్రిబ్యునల్ ఉత్తర్వుల అమలుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ దిశగా కలెక్టర్లు, ఆర్డీవోలకు అధికారాలు కట్టబెట్టింది. గతంలో మాదిరి కాలపరిమితి లేకుండా విచారణ జరిపినట్లు కాకుండా, 90 రోజుల్లోపు పరిషరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఆస్తుల బదలాయింపు ఫిర్యాదులపై కలెక్టర్ పదిహేను రోజుల్లోగా స్పందించి, నిజ నిర్ధారణకు సదరు ఫిర్యాదును ఆర్డీవోకు పంపించాల్సి ఉంటుంది. ఉత్తర్వులు అందిన వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి రెండు నెలల్లోగా ఆర్డీవో నివేదికను కలెక్టర్కు అందజేయాలి. అనంతరం వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం కల్పించింది. అయితే, గతంలో మాదిరి లిఖిత పూర్వకంగా కాకుండా ఫిర్యాదుదారులు www.tsseniorcitizens. cgg.gov.in అనే పోర్టల్ ద్వారా కూడా చేసే వెసులుబాటు కల్పించింది. దేశంలోనే తొలిసారిగా 2019 నుంచే 14567 అనే హెల్ప్లైన్ నంబర్తో సేవలందిస్తుండగా, దీనికి అంతగా ప్రాచుర్యం లభించలేదు. వృద్ధ్ద తల్లిదండ్రుల పట్ల సంతానం అనుసరిస్తున్న నిరక్ష్య వైఖరిపై ఏటేటా ఫిర్యాదుల సంఖ్య పెరుగుతూనే ఉండగా, స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా చట్ట సవరణకే శ్రీకారం చుట్టింది.
ఫలిస్తున్న చర్యలు
కొత్త చట్టం అమలుకు అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తున్నది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రుల పట్ల కొడుకులు, కోడళ్లు, కూతుర్ల వ్యవహార శైలిలో మార్పులు వస్తున్నాయని జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతంలో కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు, పోలీస్ స్టేషన్లలో ఏటా వందల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చేవని, ప్రస్తుతం పదుల సంఖ్యకు చేరినట్లు తెలుస్తోంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సవరణలు చేసిన చట్టంపై వయోవృద్ధులు, దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులతో పాటు వారి సంతానానికి కూడా అవగాహన కల్పిస్తున్నారు.
చట్టాల్లో సవరణ సంతోషకరం
సీనియర్ సిటిజన్ల చట్టాల్లో ప్రభుత్వం సవరణలు చేయడం సంతోషకరం.. ఈ నిర్ణయం, సీనియర్ సిటిజన్ల చట్టాల్లో తెచ్చిన మార్పులతో, తల్లిదండ్రులను సక్రమంగా చూసుకోని వారే క్షోభకు గురికావాల్సి ఉంటుంది. వృద్ధుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం అభినందనీయం. వయోవృద్ధులను సమాజంలోని ప్రతి ఒకరూ ఆదరించి, అండగా నిలువాలి.
– ఉచ్చిడి మోహన్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ సభ్యుడు
నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
వృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. సవరించిన చట్టాల ప్రకారం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు. వీటిపై ప్రతి ఒకరూ అవగాహన కలిగి ఉండాలి. సర్కారు కల్పిస్తున్న సౌకర్యాలను వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలి. వేధింపులకు గురయ్యే వృద్ధులు, దివ్యాంగుల శాఖ కార్యాలయానికి నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు.
– కే.సబితాకుమారి,జిల్లా సంక్షేమాధికారి (కరీంనగర్)