ముకరంపుర, ఫిబ్రవరి 6 : విద్యుత్ వినియోగదారులు తమ హక్కులను సామరస్యంగా సాధించుకోవాలని రాష్ట్ర ఈఆర్సీ చైర్మన్ టీ శ్రీరంగారావు సూచించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో విద్యుత్ సమస్యలపై వినియోగదారులతో సోమవారం నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో ఆయన మాట్లాడారు. హక్కులతోపాటు బాధ్యతలను వినియోగదారులకు తెలియజేస్తూ వారి సమస్యలను పరిష్కరించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. చట్టం కల్పించిన హక్కుల గురించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి అధికారి నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారులు ఎప్పటి వరకు పరిష్కరిస్తారో స్పష్టం చేస్తారని, ఒక వేళ పరిష్కారం కాకపోతే ఈఆర్సీ సంబంధిత అధికారులకు పెనాల్టీ వేస్తుందన్నారు. ప్రతి యూనిట్కు చెల్లించే మొత్తంలో 70 పైసలు అధికారుల జీతాల కోసం వస్తుందన్నారు.
వినియోగదారుడిని దేవుడితో సమానంగా భావించి వారితో మర్యాదగా వ్యవహరించాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. అదే సమయంలో వినియోగదారులు సామరస్యంగా తమ హక్కులను సాధించుకోవాలని, ఘర్షణ వాతావరణానికి అవకాశం ఇవ్వద్దని కోరారు. ప్రతి దరఖాస్తుకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలని సూచించారు. వ్యవసాయ భూముల్లో టవర్లు నిర్మిస్తే పరిహారం పొందవచ్చని, ఈ విషయంలో ఉన్న హక్కుల గురించి తెలియజేశారు. వ్యవసాయ, గృహ, వాణిజ్య వినియోగదారుల హక్కులు, సమస్యల పరిష్కారం గురించి వివరించారు. ట్రాన్స్ఫార్మర్ పాడైతే రైతులకు 48 గంటల్లోగా ఏర్పాటు చేయాలన్నారు. సకాలంలో బిగించకపోతే ఆ ట్రాన్స్ఫార్మర్ కింద ఉన్న వినియోగదారుడికి రోజుకు రూ.200 చొప్పున చెల్లిస్తారని చెప్పారు.
మౌలిక సదుపాయాలకు రూ.38 వేల కోట్లు
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం, పంపిణీ సంస్థలు అన్ని కేటగిరీలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు రూ.38 వేల కోట్లు వెచ్చించిందని చెప్పారు. ఇరిగేషన్ తర్వాత విద్యుత్ ప్రాజెక్టులపైనే ఎక్కువ పెట్టుబడి పెట్టిందన్నారు. దాని ఫలితాలు కూడా కనిపిస్తున్నాయన్నారు. కరీంనగర్లో హెచ్టీ కనెక్షన్ ఇండస్ట్రీలు వస్తున్నాయని, రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు. నీటి వనరులు పెరుగడంతో చేపలకు సంబంధించిన ప్రాజెక్టులు, గోదాములు, ఫుడ్ ఫ్రాజెక్టులు, ఆహారం నిల్వ చేసే కోల్డ్ స్టోరేజీలు రానున్నాయని చెప్పారు.
ఈఆర్సీ ఆదేశాలను పంపిణీ సంస్థలు అమలు చేయాలని, వాటిని నియంత్రించే బాధ్యత తమదేనన్నారు. 24 గంటల సరఫరాపై ప్రజలు, సంస్థల నుంచి మంచి సూచనలు వచ్చాయన్నారు. దేశంలో మిగిలిన రాష్ర్టాల్లో పవర్ హాలిడేలున్నా తెలంగాణలో మాత్రం నాణ్యమైన విద్యుత్ను నిరంతరం సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. అనుమతికి మించి వినియోగం జరుగుతున్నందున రోజుకు రూ.35 కోట్లు వెచ్చించి విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ను అందిస్తున్నాయన్నారు. గతేడాది ఏప్రిల్లో రూ.3,800కోట్లు అదనంగా వెచ్చించి బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొని వినియోగదారులకు అందించాయన్నారు.
హైదరాబాద్కు ప్రపంచ దేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, నిరంతర నాణ్యమైన విద్యుత్, శాంతిభద్రలు, నీటి సౌకర్యంతోనే ఇది సాధ్యమైందని వివరించారు. సాఫ్ట్వేర్, అనేక రకాల పరిశ్రమలు రాష్ర్టానికి రావడంతో రెవెన్యూతోపాటు లక్షలాది ఉద్యోగ నియమకాలు జరుగుతున్నాయన్నారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం పంపిణీ సంస్థలకు రూ.10,500 కోట్లు రాయితీ రూపంలో చెల్లిస్తున్నదని, రజక, నాయీ బ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు బీసీ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీలకు 101యూనిట్ల వరకు ఆయా కార్పొరేషన్లు విద్యుత్ సంస్థలకు బిల్లు చెల్లిస్తున్నాయన్నారు.
వ్యవసాయ వినియోగం తెలిసేందుకే డీటీఆర్ల వద్ద మీటర్లు
వ్యవసాయ వినియోగానికి ఎంత విద్యుత్ వినియోగిస్తున్నామో కచ్చితంగా తెలుసుకోవడం కోసమే వ్యవసాయ డీటీఆర్ల వద్ద మీటర్లు పెట్టి వినియోగం లెక్కలు తీయాలని ఈఆర్సీ పంపిణీ సంస్థలను ఆదేశించిందన్నారు. 100 యూనిట్ల విద్యుత్ను పంపిణీ చేస్తే 60 యూనిట్ల వరకే బిల్లింగ్ అవుతుందన్నారు. మరో 25 యూనిట్లు వ్యవసాయ రంగం వినియోగిస్తుండగా, 15 యూనిట్ల నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 27 లక్షల పంపుసెట్లు ఉన్నాయని, వీటి వినియోగం కోసం వ్యవసాయ డీటీఆర్ల వద్ద మీటర్లు పెట్టి లెక్కలు తీయాలని ఈఆర్సీ ఆదేశించిందన్నారు. అప్పుడే సరఫరా పంపిణీ నష్టాలు తెలుస్తాయన్నారు.
పంపిణీ సంస్థల అంతర్గత సామర్థ్యాలు పెంపు, నష్టాలు తగ్గించుకునేందుకు వీలుంటుందన్నారు. వ్యవసాయ రంగ విద్యుత్ లెక్కలు కచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశామని చెప్పారు. అప్పుడే ప్రభుత్వం కచ్చితమైన సబ్సిడీ చెల్లించడానికి వీలుంటుందన్నారు. రైతులు ఆటో స్టార్టర్లను తొలగించి, కెపాసిటర్లు పెట్టుకోవాలని కోరారు. దీంతో 15 నుంచి 20 శాతం విద్యుత్ ఆదా అవుతుందన్నారు. పర్యావరణ రక్షణ చర్యల్లో భాగంగా కేంద్రం 2070 వరకు థర్మల్ విద్యుత్ను సున్నాకు తెచ్చి పునరుత్పాదక విద్యుత్ను వాడాలని లక్ష్యాన్ని నిర్ధేశించిందన్నారు. అంతర్జాతీయ సమావేశంలోనూ రానున్న రోజుల్లో థర్మల్ ఉత్పత్తిని పూర్తిగా తగ్గించాలని, విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని సూచించారని తెలిపారు.
అంతకు ముందు ఎస్ఈ వీ గంగాధర్ జిల్లా విద్యుత్ ముఖ చిత్రం గురించి పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా వినియోగదారులు ఈఆర్సీకి ముఖాముఖిగా వివరించిన సమస్యలను సాధ్యమైనంత వరకు నెల రోజుల వ్యవధిలో పరిష్కరించనున్నట్లు చెప్పారు. సీజీఆర్ఎఫ్ చైర్మన్ వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పరిష్కారానికి తీసుకున్న చర్యల గురించి వివరించారు.
పలువురి సమస్యలు విన్న ఈఆర్సీ చైర్మన్ టీ శ్రీరంగారావు మాట్లాడుతూ, అధికారులు స్పందించకుంటే నేరుగా హైదరాబాద్లోని తమ కార్యాలయానికి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040-23311127 నంబరుకు చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అదేవిధంగా ఏసీడీ చార్జీల గురించి వినియోగదారులకు నోటీసులు ఇచ్చిన తర్వాతే వసూలు చేయాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్, అధికారులను ఆదేశించారు. సమావేశంలో మండలి సభ్యులు బీ కృష్ణయ్య(ఫైనాన్స్), ఎండీ మనోహర్రాజు(టెక్నికల్), ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఏసీడీ చార్జీలపై అవగాహన కల్పించాలి
ఎన్పీడీసీఎల్ సంస్థ వినియోగదారులకు ముందస్తుగా నోటీసు ఇవ్వకుండా ఏసీడీ చార్జీలు విధించడం సరికాదు. చార్జీలు చెల్లించకుంటే కనెక్షన్లు కట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సమయాన్ని ముందుగానే ప్రకటిస్తే పొలాలు ఎండే పరిస్థితి వచ్చేది కాదు. విద్యుత్ సమస్యలు తెలియజేసేందుకు గ్రామాలు, పట్టణాల్లో ప్రతి చోట టోల్ఫ్రీ నంబర్ను, విద్యుత్ అధికారులు, సిబ్బంది ఫోన్ నంబర్లను రాయించాలి. వినియోగదారులతో అధికారులు మర్యాదగా వ్యవహరించేలా చూడాలి. కుర్చీలు, తాగునీటి వసతి కల్పించాలి. కరీంనగర్ టౌన్ ఈఆర్వో కేంద్రం మార్గం వద్ద ఇబ్బంది ఉన్నందున మరో దారిని ఏర్పాటు చేయాలి. లేదంటే ఎస్ఈ కార్యాలయంలో ఏర్పాటు చేయాలి. లూజ్లైన్లను సరిచేయాలి.
– సంపత్రావు, భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధి
కనెక్షన్ల జారీలో ఇబ్బందులు తొలగించాలి
కొత్తగా 75 గజాల్లో నిర్మించుకునే ఇంటికి ఇచ్చే కనెక్షన్ విషయంలో ఉన్న సమస్యలను తొలగించాలి. నా డివిజన్ పరిధిలో ఇనుప స్తంభాలు తుప్పు పట్టి ప్రమాదకరంగా మారినందున వాటిని పూర్తిగా తొలగించి కొత్తవి వేయాలి. నోటీసు ఇవ్వకుండా ఏసీడీ చార్జీలు వసూలు చేయవద్దు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
– పెద్దపల్లి జితేందర్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్
కొత్త సెక్షన్ ఏర్పాటు చేయాలి
మండలం విస్తీర్ణం, జనాభాను దృష్టిలో ఉంచుకుని సత్వర సేవలు అందించేలా రామడుగులో ప్రత్యేకంగా కొత్త సెక్షన్ను ఏర్పాటు చేయాలి. పొలాల్లో ఉన్న లూజ్లైన్లతో ప్రమాదాలు పొంచి ఉన్నందున సరిచేయాలి. సమస్యలు విన్నవించేందుకు మండల సమావేశాలకు డివిజన్స్థాయి అధికారులు హాజరయ్యేలా చూడాలి. అనుభవం కలిగిన వారితోనే గృహ విద్యుత్ మీటర్ల రీడింగ్ తీయించాలి.
– కోల రమేశ్, దేశరాజ్పల్లి సర్పంచ్
ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటులో నిర్లక్ష్యం
మా గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటులో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో వారంలో ఐదు సార్లు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోగా 25 మంది రైతుల మోటార్లు దెబ్బతిన్నాయి. నాణ్యమైన విద్యుత్ను 16 గంటలు ఇచ్చినా సరిపోతుంది. గ్రామంలోని కాలనీల్లో విద్యుత్ విస్తరణ పనులు చేపట్టాలి. గ్రామంలో చేసిన విద్యుత్ పనులకు ఎవరూ ఎంబీ రికార్డుచేయడం లేదు. విద్యుత్ శాఖ స్కీంల గురించి అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు గ్రామాల్లో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలి. ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, గద్దెల నిర్మాణానికి రైతుల నుంచే డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది సరికాదు.
– బొల్లం మురళీధర్, నిజాయితీగూడెం