కరీంనగర్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నోరు తెరిస్తే హిందూ, ముస్లిం, దారుస్సలాం అంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడని, ఆ మాటలు పేలడం లేదని, ప్రజలు నమ్మడం లేదని, ఇప్పటికైనా అహంకార పూరిత మాటలు మానుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు అడుక్కోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ హితువు పలికారు. సోమవారం కరీంనగర్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. బండి సంజయ్ అంటే పెద్ద నాయకుడు అనుకున్నానని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన రాజాసింగ్ను తెచ్చుకుని నామినేషన్ వేసి, ఆయన స్థాయిని పూర్తిగా దిగజార్చుకున్నారని ఎద్దేవా చేశారు.
కరీంనగర్లో బండి సంజయ్ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని, ఇప్పటి వరకు కనీసం రెండో స్థానంలో ఉంటాడని అనుకున్నామని, నామినేషన్ వేయడానికి రాజాసింగ్ను తెచ్చుకోవడంతో ఇప్పుడు ఆయన మూడో స్థానానికి పడిపోయాడని స్పష్టం చేశారు. చుట్టు పక్కల 20 స్థానాల్లో ప్రచారం నిర్వహించి, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలనే ఉద్దేశంతో బండి సంజయ్కి ఆయన పార్టీ హెలిక్యాప్టర్ కేటాయించిందని, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన, అదే స్థాయి నాయకులను రప్పించుకుని నామినేషన్ వేస్తారని అనుకున్నామని, కానీ గోషామహల్లో ఓడిపోయే అభ్యర్థిని తెచ్చుకొని, ఆయనతో కలిసి నామినేషన్ వేయడంతోనే ఆయన స్థాయి దిగజారి పోయిందని ఎద్దేవా చేశారు. కరీంనగర్ అసెంబ్లీలో బీజేపీ మూడో స్థానానికి పడిపోయిందని తెలిపారు.
బండి సంజయ్ నామినేషన్కు వచ్చిన రాజాసింగ్ కరీంనగర్ అభివృద్ధి ఎట్లున్నదో చూశాడని, ఇలాంటి అభివృద్ధి తన నియోజకవర్గమైన గోషామహల్లో జరిగిందా? అని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లు చెప్తున్న మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. రాజాసింగ్ సమర్థుడే అయితే తన పక్క నియోజకవర్గాల్లో ఒక్క సీటన్నా గెలిపించగలడా? అని నిలదీశారు. ప్రజలు శక్తి వంతులని, ఎవరు ఏం చేస్తున్నారో గ్రహిస్తారని, కరీంనగర్ ప్రజలు మరింత విజ్ఞులని వాళ్లు కోరుకునేది అభివృద్ధి మాత్రమేనని స్పష్టం చేశారు. తననో, తమ సీఎం కేసీఆర్నో తిడితే ఓట్లు పడవని, ఎంఐఎం, దారుస్సలాం అని తిడితే ఓట్లు రావని హితవుపలికారు. ఎంపీగా నిలబడినప్పుడు ఇదే విధంగా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టిన బండి సంజయ్ ఇపుడు కూడా అదే దారిలో నడవాలని చూస్తున్నాడని, ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ను అనవసరంగా తన స్వార్థ రాజకీయాల కోసం బలి చేయవద్దని సూచించారు.
ఎంపీగా గెలిచి ఏం చేశావో ప్రజలకు చెప్పి హూందాగా ఓట్లు అడుక్కోవాలి గానీ, అనవరసంగా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం మంచిది కాదన్నారు. బండి మాటలు విని ప్రజలకు బోరుకొట్టిందని, నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. బీజేపీ నాయకులు బీసీ సీఎం అని కొత్త నాటకానికి తెర తీశారని, ఒక బీసీ నాయకుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండినే ఆ పదవి నుంచి తొలగించిన విషయాన్ని మర్చిపోవద్దని సంజయ్ని ఉద్దేశించి సూచించారు. బీజేపీ నాయకులు రేషన్ కార్డుల విషయాన్ని ప్రస్తావిస్తున్నారని, రేషన్ కార్డులు ఇవ్వాల్సింది ఎవరో వాళ్లకు తెలియదా? అని ప్రశ్నించారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వమే రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుందని, తెలంగాణ ఏర్పడినప్పుడు 90 లక్షల రేషన్ కార్డులు అవసరం ఉంటాయని కేసీఆర్ అడిగితే పదేళ్ల కింద కేవలం 54 లక్షల కార్డులు మాత్రమే ఇచ్చారని, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని 35.67 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్ గుర్తు చేశారు.
ఈ కార్డుల భారమంతా ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. ఇవి కాకుండా 2016లో 31,196, 2017-18లో 19,113, 2018-19లో 1,67,601, 2019-20లో 99,570, 2021-22లో 3,11,025, 2022-23లో 18,979 రేషన్ కార్డులు ఇచ్చి పేద ప్రజలను ఆదుకుంటున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటే రాష్ట్ర ప్రభుత్వం భారమైనా బాధ్యతగా తీసుకున్నదని గుర్తు చేశారు. బండి సంజయ్ ఎంత రెచ్చగొట్టినా యువకులు రెచ్చిపోయే పరిస్థితి కనిపించడం లేదని, బండి సంజయ్ మాటలు ఎలా ఎంటాయో వారికి పూర్తిగా అర్ధమైందన్నారు. ప్రజలు విధ్వంసాన్ని కోరుకోవడం లేదని, సమగ్ర అభివృద్ధిని కోరుకుంటున్నారని, వారికి కావాల్సిన పనులు తాము చేసి పెడుతున్నామని, తాము చేసిన పనులు చెప్పే ప్రజల నుంచి ఓట్లు అభ్యర్థిస్తున్నామని తెలిపారు. బీజేపీ నాయకులు చేసిన పనులు చెప్పి ప్రజలకు ముందుకు వెళ్లి ఓట్లు అడగాలని సూచించారు. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్ట వద్దని, అహంకార పూరిత మాట్లాలు మాట్లాడవద్దని బండి సంజయ్కి హితువు పలికారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కరీంనగర్ మేయర్ పదవి ముస్లిం మైనార్టీలకు ఇస్తారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. తమ పార్టీలో నాయకులకు కొదవ లేదని, గత ఎన్నికల్లో తాము 60 కార్పొరేటర్ స్థానాలకు పోటీ చేశామని, ఎంఐఎంతో కలిసి ఉంటున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటామని స్పష్టం చేశారు. తాను 8, 9 తేదీల్లో నామినేషన్ దాఖలు చేస్తానని, గత మూడు ఎన్నికల కంటే మంచి మెజార్టీతో ప్రజలు తనను గెలిపిస్తారనే విశ్వాసం ఉందన్నారు. బండి సంజయ్కి మూడో స్థానం ఖాయమైందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నగర మేయర్ వై సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కరీంనగర్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, సింగిల్ విండో చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, నాయకులు పిల్ల మహేశ్, వాసాల రమేశ్ పాల్గొన్నారు.