కాంగ్రెస్కు చెందిన నాయకులే గతంలో పచ్చగా ఉన్న తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో విలీనం చేసి ఇక్కడి వనరులను పూర్తిగా దోచుకున్నారని, ఇప్పుడు మళ్లీ వాళ్లే ఓటు కోసం వస్తున్నారని, ఒక్క తప్పు చేసినా రాష్ట్రం 50 ఏళ్ళు వెనక్కి పోతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం కొత్తపల్లి పట్టణంలో అన్ని కుల సంఘాల ప్రతినిధుల, కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూర్లో ముదిరాజ్, మున్నూరు కాపు సంఘం ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. తర్వాత జిల్లా కేంద్రంలోని పద్మనగర్లో నిర్వహించిన జిల్లా ప్లంబర్ అసోసియేషన్, జిల్లా ఫోర్ వీల్లర్స్ మెకానిక్స్, డెటింగ్ అసోసియేషన్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి ప్రసంగించారు.
– కార్పొరేషన్/ కొత్తపల్లి/ కరీంనగర్రూరల్, నవంబర్ 1
కొత్తపల్లి, నవంబర్ 1 : ఈ ఎన్నికల్లో ఒక్క తప్పు చేస్తే మళ్లీ యాభై ఏళ్లు వెనక్కి వెళ్తామని, ఆలోచించి అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ సూచించారు. బుధవారం ఉదయం కొత్తపల్లి పట్టణంలో నిర్వహించిన అన్ని కుల సంఘాల ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. కొత్తపల్లి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్ని కుల సంఘాలకు చెందిన వ్యక్తులు తనకు మద్దతు ప్రకటించడం జీవితంలో మరిచిపోలేనిదని, మీ అభిమానానికి శిరసు వంచి కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కసారి గెలిచిన అభ్యర్థి రెండోసారి గెలిచిన చరిత్ర ఇక్కడ లేదని, తనపై అభిమానం, తాను చేసిన అభివృద్ధి పనులతో కరీంనగర్ ప్రజలు వరుసగా రెండోసారి, మూడోసారి విజయం అందించి అక్కున చేర్చుకున్నారని, వారి ఆదరాభిమానులు జీవితంలో మరిచిపోనన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్రెడ్డితోపాటు ఆంధ్రా నాయకులు షర్మిల, పవన్కల్యాణ్, తదితరులు హైదరాబాద్లో మకాం వేసి తెలంగాణను మళ్ళీ ఆంధ్రాలో కలిపే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు.
ఐదు నెలల కాంగ్రెస్ పాలనకే కర్ణాటకలో ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు. ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ ఒకటేనని చెప్పారు. ఒక నెల తన కోసం కష్టపడితే ఐదేళ్లు మీకోసం సేవ చేస్తానని హామీ ఇచ్చారు. తనపై పోటీ చేసిన నాయకులు ఎన్నికలప్పుడు మాత్రమే కనిపిస్తారని, ఇప్పుడు సైతం ఇదే జరుగుతుందన్నారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. భూ కబ్జాదారులకు కాంగ్రెస్ టికెట్లు ఇస్తున్నదని, దీనిని ప్రజలంతా గుర్తించాలని కోరారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఒక్క రూపాయి నిధులు తేలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కొత్తపల్లి పట్టణం ఎలా ఉండేదో రాష్ట్రం వచ్చాక ఎంత అభివృద్ధి జరిగిందో గమనించాలన్నారు.
కరీంనగర్ పక్కనే ఉన్న కొత్తపల్లిని గత పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని, తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే కొత్తపల్లి అభివృద్ధిని పూర్తి స్థాయిలో చేశానన్నారు. ఇప్పుడు పట్టణంలో వీధివీధికీ సీసీ రోడ్లు, ఇంటింటికీ సురక్షితమైన మంచినీరు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఎన్నికల కోడ్తో సెంట్రల్ లైటింగ్ పనులు నిలిచిపోయాయని, ఎన్నికల ముగిసిన అనంతరం ప్రారంభమవుతాయన్నారు. సమైక్య పాలకుల దోపీడీతో తెలంగాణ రాష్ట్రం వలసలకు కేంద్రంగా మారితే సీఎం కేసీఆర్ పాలనతో ఇతర రాష్ర్టాల వారికి తెలంగాణ ఉపాధి కేంద్రంగా మారడం గర్వంగా ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నా.. మంత్రిగా ఉన్నా ఎప్పుడూ ప్రజల మధ్యే ఉండి అభివృద్ధి చేయడంతోనే తనకు మద్దతు లభిస్తుందన్నారు.
ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలకు మోసపోవద్దన్నారు. అమలు కానీ హామీలిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయలేక చేతులేత్తేసిందన్నారు. తనను మళ్లీ గెలిపిస్తే కొత్తపల్లి పట్టణాన్ని మరింత అభివృద్ది చేసి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు యువకులు బీఆర్ఎస్లో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 25 కుల సంఘాలకు చెందిన నాయకులు మంత్రి గంగులకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. జడ్పీ మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ జమీలుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్, బండ గోపాల్రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పలు కుల సంఘాల నాయకులు, రైతు సమన్వయ సమితి నాయకులు, పట్టణవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.