Mallapur | మల్లాపూర్, సెప్టెంబర్ 7 : మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ది గాంచిన ప్రాచీన చరిత్ర గల శ్రీ కనక సోమేశ్వరస్వామి ఆలయం వద్ద నాలుగవ చివరి శ్రావణమాస సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు కాలినడకన కొండపైకి ఎక్కి కొండపై గల సహజసిద్దమైన కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి ఎంతో భక్తి శ్రద్ధలతో సోమేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన వరదపాశం(బెల్లం అన్నం)ను వండి ఆలయం ఎదుట వరదపాశం పోసి తమ మొక్కులను చెల్లించి అక్కడే సహంపక్తి భోజనాలు చేయడం అనావాయితీ. చివరి శ్రావణమాస సోమవారం సందర్భంగా భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను చేశారు. భక్తులకు కొండ కింద ఏలేటి జగన్ రెడ్డి- నీల దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదానం చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు బల్యపల్లి ప్రభాకరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను చేశారు. ఈ వేడుకల్లో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, అదిలాబాద్ జిల్లాలతో పాటు, మహారాష్ట్ర ప్రాంతాలను నుండి భక్తులు తరలివచ్చారు. ఇక్కడ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు క్యాతం సురేష్ రెడ్డి, కమిటీ సభ్యులు, అధికారులు, అఖిలపక్షం పార్టీల నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.