Bhu Bharati Reserve Survey | చిగురుమామిడి, సెప్టెంబర్ 15 : చిగురుమామిడి మండలంలోని కొండాపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ వద్ద సర్పంచ్ మార్క రాజ్ కుమార్ అధ్యక్షతన భూభారతి రీ సర్వేపై ప్రత్యేక గ్రామసభ మంగళవారం నిర్వహించారు. ఈ గ్రామ సభకు ఏడీసీ కిషన్ రావు, తాసిల్దార్ కోడం కనకయ్య హాజరై మాట్లాడుతూ కొండాపూర్ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేశామని, గ్రామస్తులందరూ రీ సర్వేను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొండాపూర్ గ్రామ పరిధిలో 1054 ఎకరాల భూమి, 381 సర్వే నెంబర్లు ఉన్నాయన్నారు. ఇందులో 8 ఎకరాలు గ్రామ కంఠం, ప్రభుత్వ భూమి 83 ఎకరాలు, ప్రైవేట్ పట్టా భూమి 951 ఎకరాలు, 365 సర్వే నెంబర్లు ఉండగా 627 మంది పట్టాదారులు ఉన్నట్లు తెలిపారు. ఈ సర్వేలో ప్రతీ భూమిని సర్వే ద్వారా పరిశీలించి ధృవీకరించనున్నట్లు చెప్పారు.
ఏమైనా అభ్యంతరాలు, సమస్యలు ఉంటే సర్వే సమయంలో సర్వేయర్ కు తెలియజేయగలరని గ్రామసభలో సూచించారు. ముందుగా సంబంధిత పట్టాదారులకు సమాచారం అందిస్తామని, ప్రతి ఒక్కరు సహకరించాలని వారు కోరారు. ఈ గ్రామ సభలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ బీ శ్రీనివాస్, ఆర్ఐ నాగరాజు, సర్వేయర్ బాలమురళీకృష్ణ, ఉపసర్పంచ్ బింగి రాజేంద్రప్రసాద్,పాస్ డైరెక్టర్ కనగండ్ల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి అమృత వర్షిణి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.