కోరుట్ల రూరల్, జనవరి 6: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ తోట నారాయణ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రూ.10కోట్లు మంజూరు చేశారన్నారు. ప్రతి గ్రామంలో చేపడుతున్న సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా గ్రామాల్లో నీటి సరఫరా సక్రమంగా జరగకపోతే ప్రజాప్రతినిధులు అధికారులకు సూచించాలన్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం పట్టణంలో వంద పడకల దవాఖానను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
పట్టణంలోని మద్దుల చెరువును మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. మండలాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. రాష్ట్రంలోనే కోరుట్ల నియోజకవర్గం అభివృద్ధిలో నంబర్ వన్గా నిలిచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయాన్ని పట్టణంలోని కల్లూరు రోడ్డులోని ఎస్సారెస్పీ స్థలంలో నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను మాదాపూర్ సర్పంచ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్ కోరగా ప్రభుత్వ కార్యాలయాన్నీ ఒకేచోట ఉండేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అధికారులు గ్రామాల్లో పర్యటించినప్పుడు ప్రజాప్రతినిధులకు సమాచారం ఇచ్చి అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తోట నారాయణ, జడ్పీటీసీ దారిశెట్టి లావణ్య, వైస్ ఎంపీపీ చీటి స్వరూప, సర్పంచుల ఫోరం జిల్లా గౌరవాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావ్, ఇన్చార్జి ఎంపీడీవో నీరజ, తహసీల్దార్ రాజేశ్, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ఖయ్యూం, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సీడీపీవో తిరుమలాదేవి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, సహకార సంఘాల అధ్యక్షులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన వీడీసీ సభ్యులు
వర్షకొండ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు టీటీడీ బోర్డు సభ్యుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వర్షకొండ గ్రామంలోని అతిపురాతన ఆలయం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు రూ.10లక్షలు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. నిధుల మంజూరు కృషి చేస్తానని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ దొంతుల శ్యామల-తుకారం, ఎంపీటీసీ పొనుకంటి వెంకట్, ఉప సర్పంచ్ మంగలిపెల్లి లక్ష్మణ్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు దోమకొండ చిన్న రాజన్న, ఉపాధ్యక్షుడు జోగ ధనుంజయ, బీఆర్ఎస్ నాయకుడు మామిడి సురేశ్ రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పుటకోకుల నర్సయ్య, తూటుకూర్ల ప్రేమ్ కుమార్, చింతకుంట శ్రీనివాస్, తాండ్ర సంజీవ్తోపాటు పాల్గొన్నారు.