పల్లె దవాఖానల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. ఒక ఎంబీబీఎస్ వైద్యుడితోపాటు ల్యాబ్టెక్నీషియన్, ఏఎన్ఎం ఉంటారు. ఎంబీబీఎస్ డాక్టర్ లేని చోట స్టాఫ్నర్స్ను నియమించారు. చిన్న చిన్న జ్వరాలు, ఇతర నొప్పులతోపాటు బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు చికిత్స, మందులు అందిస్తున్నారు. ఊర్లోనే వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు వైద్యరంగానికి ప్రాధాన్యమిస్తున్నది. కోట్లాది రూపాయలతో దవాఖానలను బలోపేతం చేస్తున్నది. ఆధునిక వైద్య పరికరాలు సమకూరుస్తున్నది. కీలకమైన ఆపరేషన్లను సైతం జిల్లా దవాఖానల్లోనే చేస్తున్నది. జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడమే కాకుండా, తాజాగా వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తెస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో 66 విలేజ్ హాస్పిటళ్లు సేవలందిస్తుండగా, అందులో 38 పల్లె దవాఖానలకు పక్కా భవనాలు మంజూరు చేశారు. ఓదెల మండలం కనగర్తిలో భవన నిర్మాణం జిల్లాలోనే మొదటగా పూర్తి కాగా, మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రారంభించారు. మిగతా భవనాలు పురోగతిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మా ఊరి డాక్టర్నే నియమించిన్రు
నాది గుండ్లపల్లి. ఇంతకుముందు ఏ చిన్న రోగం వచ్చినా పట్టణాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతుంటిమి. ఇప్పుడు పల్లె దవాఖాన ఏర్పాటు చేసిన్రు. ఎంబీబీఎస్ డాక్టరమ్మను కూడా నియమించిన్రు. బీపీ, షుగర్, జ్వరం, నొప్పులు ఇతర చిన్న చిన్న వ్యాధులకు ఇక్కడనే పరీక్షలు చేసి మందులు ఇస్తున్రు. మా ఊరి డాక్టరే కావడంతో రాత్రి కూడా మాకు వైద్యం అందుతున్నది. ఊరిలోనే ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటున్నం. మంచి ఆలోచన చేసిన సీఎం కేసీఆర్ సారుకు నా కృతజ్ఞతలు.
– వేల్పుల మల్లయ్య, గుండ్లపల్లి (ఓదెల)
కేసీఆర్ సారు చాలా మంచి పనిచేసిండు
మొన్నటిదాకా ఎంతో మంది పేదలు వైద్యం కోసం పట్టణాలకు పోలేక అనేక అవస్థలు పడాల్సి వచ్చింది. కానీ, సీఎం కేసీఆర్ సారు పేదల కోసం మంచి ఆలోచన చేసిండు. గ్రామీణ ప్రాంత పేద ప్రజల కోసం పల్లె దవాఖానలు పెట్టి చాలా మంచి పనిచేసిండు. మా ఊరికి డాక్టర్తో పాటు ఇతర సిబ్బంది వచ్చిన్రు. రోజూ మా ఊరి ప్రజలకు వైద్యం అందిస్తున్నరు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ గొప్పతనాన్ని చాటుతుంది. అందుకు సీఎంకు కృతజ్ఞతలు తెల్పుతున్న.
– పులుగు తిరుపతిరెడ్డి, సర్పంచ్ (గుండ్లపల్లి)
మా ఊరిలోనే పనిచేయడం చాలా హ్యాపీ
నాది గుండ్లపల్లి గ్రామం. నేను ఖమ్మంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన. మా మమ్మీడాడీ ఊరిలోనే ఉంటరు. మొన్నటిదాకా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డాక్టర్గా చేసిన. పల్లె దవాఖాన ఏర్పాటుతో నేను నా సొంతూరికి వచ్చిన. మా ఊరిలోనే పనిచేసే అవకాశం వచ్చింది. చాలా హ్యాపీగా ఫీలవుతున్న. ఇంత మంచి అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్ సార్కు నా కృతజ్ఞతలు. పల్లె దవాఖానలు పెట్టడం చాలా మంచి ఆలోచన, పేదలకు వైద్యం అందుతుంది. ప్రభుత్వం ఉచితంగా మందులు ఇస్తున్నది.
– పెద్దిరెడ్డి షణ్ముఖప్రియ, పల్లె దవాఖాన డాక్టర్ (గుండ్లపల్లి)