ఉద్యోగాలు ఇప్పిస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తారు. ఫేక్ మెయిల్ ఐడీ, వాట్సప్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం నకిలీ అపాయింట్మెంట్ జాబ్ లెటర్లను పంపిస్తారు. ఇంటర్వ్యూలకు హాజరు కావాలంటే మొదటగా 50 వేలు ఇవ్వాలని మాయమాటలు చెప్పి నగదు తీసుకుంటారు. అనంతరం ఉద్యోగానికి ఎంపికయ్యారని వారి నుంచి బ్యాంక్ పాస్బుక్కులు, ఏటీఎం, ఆధార్కార్డులు తీసుకోవడమే కాకుండా దశలవారీగా డబ్బు వసూలు చేస్తారు. ఇలా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితులను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను ఆదివారం ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.
– తెలంగాణ చౌక్, ఆగస్టు 20
తెలంగాణ చౌక్, ఆగస్టు 20: ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా హీరా మండలం శుభలయకాలనీకి చెందిన సాలది రామ్గోపాల్ అలియాస్ రాంప్రసాద్ బీటెక్ చదివాడు. తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో లేబర్ కాంట్రాక్టర్గా పని చేశాడు. డబ్బు సంపాదించాలనే దురాశతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొమురవెల్లి రాజ్కుమార్తో కలిసి ఉద్యోగాలు ఇప్పిస్తానని యువతను మోసం చేసేవాడు. స్టాఫ్నర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్స్ కావాలని సీఏఆర్ఈఈఆర్ఎస్ఎన్హెచ్ఎం.జీవోవీ@జీమెయిల్.కామ్ ద్వారా నిరుద్యోగ యువతకు మెయిల్ చేసేవారు. అలాగే, ఆయుష్మాన్భారత్లో పీఆర్వో పోస్టులు ఉన్నాయని వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్కు చెందిన అజ్మీర గణేష్ భార్య సునీతకు మెయిల్ పంపారు. వివరాల కోసం 95155-59446 నంబర్ను సంప్రదించాలన్నారు. కాగా, అది నమ్మిన సునీత ఆ నంబర్కు ఫోన్ చేసింది. ఉద్యోగానికి ఎంపిక కావాలంటే కొంత డబ్బు ఖర్చు అవుతుందని నమ్మబలికారు. దీంతో సునీత వివిధ ఫోన్పే నంబర్ల ద్వారా 2.85,000 పంపించింది.
అనంతరం ఉద్యోగం రాకపోవడంతో పాటు డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించి ఏప్రిల్లో వేములవాడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సైబర్క్రైం టీం ఆర్ఎస్ఐ జునైద్ ఆధ్వర్యంలో వివిధ కోణాల్లో విచారించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లగా నిందితులు అక్కడ లేకపోవడంతో సాంకేతికతను వినియోగించారు. ఆ ఇద్దరు నిందితులు వేములవాడకు వచ్చినట్లుగా గ్రహించి శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1.60 లక్షలు, ఒక కారు, 3 మొబైల్ ఫోన్లు, 6 బ్యాంక్ పాస్బుక్స్, వివిధ కంపెనీలకు చెందిన 163 సిమ్కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్కు తరలించారు. కాగా, సాలది రాంగోపాల్పై దేశవ్యాప్తంగా 1351, తెలంగాణలో ఎన్సీఆర్పీ పోర్టల్ ద్వారా 257 ఫిర్యాదులు రాగా, 65 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 12 కేసుల్లో జైలుకు వెళ్లి శిక్ష అనుభవించాడు. కేసును చేధించిన జిల్లా సైబర్ క్రైం ఆర్ఎస్ఐ జునైద్, రాజతిరుమలేశ్, వేములవాడ ఎస్ఐ రమేశ్, రజనీకాంత్ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, నగదు పారితోషికం అందజేశారు. సమావేశంలో వేములవాడ టౌన్ సీఐ కరుణాకర్, ఎస్ఐలు జునైద్, రమేశ్, సిబ్బంది ఉన్నారు.