ప్రగతిని చూసి ఎంపీ బండి కండ్లు మండుతున్నయ్
ఆయన తీరు మార్చుకోకపోతే ప్రజలు క్షమించరు
స్మార్ట్ సిటీ కోసం రాష్ట్రం రెండో విడుత వంద కోట్లిచ్చింది
చిత్తశుద్ధి ఉంటే కేంద్రం వాటా త్వరగా ఇప్పించు సంజయ్
కరీంనగర్ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నం
353కోట్లతో స్మార్ట్సిటీ పనులు చేస్తున్నం
మేయర్ వై సునీల్రావు
ముకరంపుర, డిసెంబర్24: కరీం‘నగరం’ అభివృద్ధే ధ్యేయంగా నగరపాలక సంస్థ పాలకవర్గం పనిచేస్తుంటే ఎంపీ బండి సంజయ్ కండ్లు మండించుకుంటున్నడు. ఎక్కడ మాకు పేరు వస్తుందోనని కుటిల రాజకీయాలు చేస్తూ ప్రగతిని అడ్డుకోవాలని చూస్తున్నడు. ఆయన తీరు మార్చుకోకపోతే ఇక్కడి ప్రజలు క్షమించరు. కచ్చితంగా బుద్ధిచెబుతరు. స్మార్ట్సిటీ డెవలప్మెంట్ కోసం రాష్ట్రం రెండో విడుత తన వాటా 100కోట్లు ఇచ్చింది. నిజంగా బండికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రం వాటా త్వరగా ఇప్పించాలె. కానీ, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదిలేదు.
కరీం‘నగరం’ అభివృద్ధే ధ్యేయంగా నగరపాలక సంస్థ పాలకవర్గం పనిచేస్తున్నా ఎంపీ బండి సంజయ్కుమార్ మాత్రం తనకు రాజకీయంగా జన్మనిచ్చిన కరీం‘నగరం’అభివృద్ధిని అడ్డుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని కరీంనగర్ మేయర్ వై సునీల్రావు మండిపడ్డారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. సీఎం ఆసీస్సులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, మంత్రి గంగుల కృషితో కార్పొరేటర్లమంతా కలిసి స్మార్ట్సిటీ కోసం ఢిల్లీ వెళ్లి స్మార్ట్ సిటీ ఇవ్వాలని అడిగినప్పుడు బండి సంజయ్ ఎక్కడున్నాడో తెలియదని ఎద్దేవా చేశారు. కార్పొరేటర్గా కనీసం మాతో ఢిల్లీకైనా వచ్చాడా చెప్పాలని, ఏ రోజు కూడా స్మార్ట్సిటీ కావాలని ఎక్కడా ఎవరినీ అడిగిన దాఖలాలు లేని వ్యక్తి ఇప్పుడు ఏదేదో మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.
వంద స్మార్ట్ సిటీల్లో కరీం‘నగరం’ మెరుగు
కేంద్ర ప్రభుత్వం దేశంలో వంద స్మార్ట్ సిటీ నగరాలు ఇచ్చిందని చెప్పారు. తెలంగాణలో కరీంనగర్, వరంగల్ ఉన్నాయని, ఎక్కడాలేని విధంగా కరీంనగర్లో పనులు వేగంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. స్మార్ట్ సిటీలుగా ప్రకటించిన వాటిలో ఇంకా పనులు ప్రారంభం కాని నగరాలు చాలా ఉన్నాయని, పనులు ప్రారంభమై నత్తనడకన నడుస్తున్న నగరాలు ఉన్నాయని, కావాలంటే బండి సంజయ్కు ఆ లిస్టు కూడా ఇస్తామని చెప్పారు. ఏమీ తెలుసుకోకుండా, ఏ మాత్రం పరిజ్ఞానం లేకుండా స్మార్ట్ సిటీ పనులు నత్తనడక నడుస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు పక్కదారి పట్టించిందని, తన వాటా నిధులు విడుదల చేయలేదని ఫిర్యాదు చేస్తూ కరీంనగర్ నగర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కార్పొరేటర్గా సంజయ్కు రాజకీయ జన్మనిచ్చిన ప్రాత అభివృద్ధిని అడ్డుకునేందుకు, ప్రజల నోట్లో మట్టికొట్టేందుకు కుటీల రాజకీయ ప్రయత్నాలు చేయడం సరైంది కాదని దుయ్యబట్టారు.
కేంద్రం నుంచి రెండో విడత నిధులు తీసుకురావాలి
రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.100కోట్లు చెక్కుల రూపంలో విడుదల చేసి స్మార్ట్ సిటీ ఖాతాలో జమచేసిందని, అవసరమైతే వాటిని సంజయ్కు చెక్కుల నంబర్లతో సహా ఇస్తామని చెప్పారు. కరీంనగర్లో రూ.353కోట్ల నిధులతో జరుగుతున్న పనులు ప్రజల కండ్ల ముందు కనబడుతున్నాయని, సిటీ సుందర నగరంగా మారిపోయిందని ప్రజలంతా భావిస్తున్నారని చెప్పారు. కేంద్రం నుంచి మొదటి విడత రూ.196కోట్ల నిధులు వస్తే ఖర్చు చేసి అభివృద్ధిని ప్రజల ముందు ఉంచిన ఘనత నగర పాలక సంస్థదని, ఎంపీగా కేంద్రం నుంచి రెండో విడత నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీ 70శాతం పనులు పూర్తి చేసుకుని సుందరమైన రోడ్లతో మోడల్ కాలనీగా మారబోతున్నదని, మల్టీపర్సప్ స్కూల్ గ్రౌండ్లో పార్కు ప్రజల ముందు కనబడుతుందని, రెండు మాసాల్లో పూర్తవుతుందని చెప్పారు. సామాజిక బాధ్యతగా రూ.కోటి నిధులతో సుభాష్నగర్ ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్కు ధీటుగా మార్చామని వివరించారు. కరీంనగర్కు శాపంగా మారిన డంప్ యార్డు అభివృద్ధి కోసం 18కోట్లతో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద బయో మైనింగ్, 18కోట్లతో 24గంటల నీటి సరఫరాకు, 48కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీలో భాగంగా ఇంటింటికీ చాంబర్ నిర్మించేందుకు డీపీఆర్ పూర్తి చేసి టెక్నికల్ మంజూరు తీసుకుని టెండర్లు పిలువబోతున్న విషయం బండికి తెలియదా అని ప్రశ్నించారు. ఇవన్నీ ఆయనకు తెలియకపోతే ఎంపీగా అతను ఫెయిలైనట్లేనని, ఈ అభివృద్ధి ఎంపీకి కనిపించడం లేదా..? పనులు నత్తనడకన సాగుతున్నాయని చెప్పడానికి నోరెలా వచ్చిందని ప్రశ్నించారు.
315కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని, ప్రజలు రోడ్లపై భద్రంగా ప్రయాణించేలా సిగ్నలింగ్ వ్యవస్థ, నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 11కోట్లతో స్మార్ట్ క్లాసులు, నగర వాసుల రక్షణ కోసం 23కోట్లతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. 5కోట్లతో మల్టీపర్సస్ పాఠశాలను హెరిటేజ్ స్ట్రక్చర్గా, ప్రభుత్వ పాఠశాలల్లో 7కోట్లతో మరుగుదొడ్లను నిర్మించనున్నామని, 10కోట్లతో వెజిటెబుల్ మార్కెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. మిగిలిపోయిన రోడ్లను 40కోట్లతో కొత్తగా తీసుకుంటామని, విద్యుత్ ఉత్పత్తి కోసం సోలార్ రూప్టాప్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చే విధంగా 6కోట్లతో లైబ్రరీ భవనాన్ని నిర్మించి 2కోట్లతో డిజిటలైజేషన్ను చేస్తామని చెప్పారు. ఇప్పటికే 101కోట్లతో పనుల టెండర్లు పూర్తయ్యాయని, 800కోట్ల పనులకు సంబంధించిన పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక తమ వద్ద ఉందని, మరి పనులెక్కడ నత్తనడన నడుస్తున్నాయో ఎంపీ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ జన్మనిచ్చిన కరీంనగర్పై కక్షగట్టి, పాలకవర్గానికి ఎక్కడ పేరు వస్తుందోననే కండ్ల మంటతో అడ్డుకునే ప్రయత్న చేయడం సరైంది కాదన్నారు. నగర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్ర జలు ఎప్పుడూ క్షమించరని మండిపడ్డారు. కరీంనగర్లో పనులు జరుగుతున్న విధంగా ఎక్కడా జరగడం లేదని, పాలకవర్గ సభ్యులంతా అభివృద్ధే ధ్యేయంగా ముందుకు పోతున్నారని తెలిపారు.
నాణ్యతా ప్రమాణాల మేరకే బిల్లులు
స్మార్ట్ సిటీ పనుల నాణ్యత విషయంలో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానని, కాంప్రమైజ్ లేదని, ఎక్కడైనా ఇబ్బంది వస్తే మేం చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు. నాణ్యతా పరీక్షల తర్వాతే బిల్లు పాసవుతుందని, టెక్నికల్గా గాయత్రి అసోసియేట్స్, వరంగల్ నిట్, సుపీరియర్ ల్యాబ్ నుంచి క్వాలిటీ కంట్రోల్ రిపోర్టు తెప్పించుకుంటున్నామన్నారు. ఒక వేళ ఎవరైనా క్వాలిటీ పరంగా అవినీతికి పాల్పడినా, తప్పు చేసినా చర్య తీసుకుంటామన్నారు. రెండేళ్ల నుంచి పనులు జరుగుతుంటే కండ్లు మూసుకుని కూర్చున్నారా..అని బండిని ప్రశ్నించారు. ఇప్పటికే 200కోట్ల పేమెంట్ జరిగిందని, బ్లాక్మెయిల్ పద్ధతి మంచిదికాదని హెచ్చరించారు. బీజేపీ పక్షాన నాయకులు మున్సిపల్ కార్యాలయం ముందు ఎందుకు ధర్నా చేశారో చెప్పాల్సిన బాధ్యత ఎంపీపై ఉందని, రాజకీయ కోణంతో కరీంనగర్ నగర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా స్మార్ట్ సిటీకి సంబంధించి చేయూతనిచ్చే కార్యక్రమాలు చేపట్టాలని బండికి సూచించారు. స్మార్ట్ సిటీని తీసుకువచ్చిన ఘనత టీఆర్ఎస్దేనని, రెండేళ్ల క్రితానికి ఇప్పటికి రోడ్లు ఎలా ఉన్నాయో..? కరీంనగర్ రూపురేఖలు ఎలా మారాయో..? ప్రజలు చూస్తున్నారన్నారు. ఎంపీకీ కనిపించకపోతే అది మా దురదృష్టమని అన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు వాల రమణరావు, బుచ్చిరెడ్డి, తోట రాములు, జయశ్రీ, కుర్ర తిరుపతి, యాదయ్య, పుట్ట నరేందర్, నాయకులు గంట శ్రీనివాస్, కాశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.