ధర్మారం, డిసెంబర్ 27 : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సర్కారు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా ధర్మారం మండలానికి న్యాక్ సెంటర్ను మంజూరు చేసింది. ఇందులో 45 సంవత్సరాల్లోపు వయసు కలిగిన యువతీ యువకులు తర్ఫీదు పొందేందుకు అర్హులు. వారి అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా ప్లంబింగ్ (శానిటేషన్), ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, తాపీమేస్త్రీ, మహిళలకు కుట్లు, అల్లికలు, మగ్గంవర్క్స్ తదితర రంగాల్లో 15 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.
శిక్షణ కాలంలో మధ్యాహ్నం భోజన వసతి కల్పిస్తారు. శిక్షణ ముగిసిన అనంతరం వారి ఖాతాల్లో రోజుకూ 300 చొప్పున 4500 భృతిని జమ చేస్తారు. అంతేకాకుండా స్టేషనరీ, యూనిఫాం, హెల్మెట్ తదితర సామగ్రిని అందజేస్తారు. అలాగే సర్టిఫికెట్లు (న్యాక్ ధ్రువీకరణ పత్రాలు) అందజేస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి స్వదేశంతో పాటు విదేశాల్లోనూ ఉపాధి దొరికే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
దరఖాస్తు ఇలా..
శిక్షణ తీసుకొనే వారు ఆధార్ కార్డు, లేబర్ కార్డు, నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, బ్యాంకు ఖాతాతో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు న్యాక్ సెంటర్ల నిర్వాహకుల సెల్ నంబర్లు 9542228988, 7989750751లో సంప్రదించాలి. శిక్షణ కేంద్రం కోసం ఎంపీపీ కార్యాలయం ఎదుట ఉన్న సెర్ప్ ఆఫీసు పైఅంతస్తులో ఇది వరకు ఉన్న పాత ఉపాధి శాఖ కార్యాలయం భవనం అనువుగా ఉంటుందని ఆ శాఖ అధికారులు, ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ ఎంపీడీవో జయశీల తెలిపారు. మండల పరిధిలోని 29 గ్రామాల్లోలేబర్ కార్డు ఉన్న వారికి సమాచారమందించి జనవరి మొదటి వారంలో తొలి విడుత శిక్షణను ప్రారంభించనున్నామని నిర్వాహకులు తెలిపారు.
సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల కటౌట్లకు పాలాభిషేకం
న్యాక్ సెంటర్ మంజూరుపై బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు దేవి వంశీక్రిష్ణ అధ్వర్యంలో మంగళవారం ధర్మారంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ కటౌట్లకు పాలాభిషేకం చేశారు. స్థానిక సర్పంచ్ పూస్కూరు జితేందర్రావు, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా న్యాక్ సెంటర్ మంజూరు చేయించిన మంత్రి ఈశ్వర్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్లంబింగ్, తాపీ మేస్త్రీ, హౌస్వైరింగ్, పెయింటింగ్ అంశాల్లో యువత శిక్షణ తీసుకొని ఉపాధి పొందాలని సూచించారు.
యువత సద్వినియోగం చేసుకోవాలి
ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్యత కలిగిన కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు న్యాక్ సెంటర్ను మంజూరు చేయించినం. అర్హత కలిగిన వారు వారివారి ఆసక్తికి అనుగుణంగా ఎంచుకున్న ట్రైనింగ్ తీసుకోవచ్చు. వృత్తి నైపుణ్యం కలిగిన టీచర్లతో తరగతులు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తాం. ట్రైనింగ్ అనంతరం సర్టిఫికెట్లు ప్రదానం చేస్తాం. శిక్షణ తీసుకున్న వారికి ఉపాధి కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి.
– కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర మంత్రి
మంజూరు చేయించిన మంత్రికి కృతజ్ఞతలు
ధర్మారానికి న్యాక్ సెంటర్ రావడం ఈ ప్రాంత నిరుద్యోగులవకు వరం లాంటింది. లేబర్కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ సదవకాశం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. యువత వారు ఎంచుకున్న రంగాల్లో శ్రద్ధతో శిక్షణ తీసుకోవాలి. న్యాక్ కేంద్రాన్ని మంజూరు చేయించిన మంత్రి ఈశ్వర్కు కృతజ్ఞతలు.
– సల్వాజీ మాధవరావు, బీఆర్ఎస్ సోషల్ మీడియా మండల ప్రధాన కార్యదర్శి