సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 21 : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన చుక్క లక్ష్మి మహిళా స్త్రీశక్తి-2022 అవార్డును స్వీకరించింది. హైదరబాద్లోని హైటెక్స్లోని తెలంగాణ ఛాంబర్ అఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా అవార్డు అందజేశారు. మహిళా సంఘం సభ్యురాలైన చుక్క లక్ష్మి 2012లో రూ.3 లక్షల రుణం పొంది మక్కటుకుల తయారీ కేంద్రం ఏర్పాటు చేసింది.
తాను ఉపాధి పొందుతూ మరో పది మందికి ఉపాధి కల్పించింది. కొడుకుతో కలిసి వ్యాపారాన్ని సిద్దిపేట, జగిత్యాల, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు విస్తరించి నెలకు రూ.2 లక్షల టర్నోవర్ చేస్తున్నది. సకాలంలో రుణం చెల్లించి ఆదర్శంగా నిలిచింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు మహిళలను అవార్డుకు ఎంపిక చేయగా, జిల్లా నుంచి తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన చుక్క లక్ష్మి అవార్డుకు ఎంపికైంది. అవార్డు స్వీకరణ కార్యక్రమంలో జిల్లా నుంచి డీఆర్డీవో రవికుమార్, సీసీ ఎల్లయ్య ఉన్నారు. కాగా, తనకు రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడంపై లక్ష్మి సంతోషం వ్యక్తం చేసింది. సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది.