వచ్చే నెల 24న జరుగనున్న సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ(సెస్) ఎన్నికలకు అధికార యం త్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. పాత విధానంలోనే 11 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నది. 750 మంది సిబ్బందితో వినియోగదారుల సభ్యత్వ నమోదు, ఫొటో, ఆధార్, మొబైల్ నంబర్ల సీడింగ్ ప్రక్రియను వేగంగా చేపడుతున్నది. సంస్థ పరిధిలో 2, 69, 492 విద్యుత్ మీటర్లు ఉండగా ఇప్పటికే 140,000 సర్వీసుల డాటా సేకరించింది. మరో రెండు రోజుల్లో ఈ ప్రక్రియ ముగియనుండగా సెస్ పరిధిలోని మండలాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కనున్నది.
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : హైకోర్టు ఆదేశాలతో ఎడేండ్ల తర్వాత సెస్ ఎన్నికల నగార మోగింది. ఈ నెల 1న షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 24న ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నది. ఓటరు జాబితా రూపకల్పనలో నిమగ్నమైంది. విద్యుత్ వినియోగదారుల సభ్యత్వ నమోదుతో పాటు ఫొటో, ఆధార్, మొబైల్ నంబర్ల లింకేజీకి శ్రీకారం చుట్టింది. ఇందుకు 750 మంది సిబ్బందిని కేటాయించింది. 400 మంది వీవోలు, 150 మంది మెప్మా, 200 మంది సెస్ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ సభ్యత్వ నమోదు చేపడుతున్నారు. స్మార్ట్ఫోన్లో వినియోగదారుడి ఫొటో తీసి ఇంటి నంబర్, చిరునామాను ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నారు. వివరాలు సేకరించే సిబ్బందికి ఒక్కో డాటాకు రూ. 4 చొప్పున చెల్లిస్తున్నారు. వినియోగదారులను చైతన్య పరిచేందుకు ఊరూరా డప్పు చాటింపు, మైకుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
4 నియోజకవర్గాలు.. 11 డైరెక్టర్ స్థానాలు..
సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ (సెస్ )పరిధిలో నాలుగు నియోజకవర్గాలలో 11 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాలున్నాయి. సంస్థ పరిధిలో మొత్తం 2 లక్షల 69వేల 492 మీటర్ కనెక్షన్లు ఉన్నాయి. సర్వీసులున్న వారే ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి విద్యుత్ సర్వీసు కలిగిన వినియోగదారుడి ఫొటో, ఆధార్కార్డు, మొబైల్ నంబర్ సీడింగ్ ప్రక్రియకు ప్రారంభించారు. ఇప్పటి వరకు లక్షా 40 వేల మంది వివరాలు సేకరించారు. లక్ష్యం మేరకు ఈనెల 8వ తేదీ వరకు వివరాలు సేకరించి అనుసంధాన ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఎన్నికల షెడ్యూల్..
డిసెంబర్ 24న సెస్ సంస్థ పాలకవర్గ ఎన్నికలు డిసెంబర్ 24న జరుగనుండగా, ఈనెల 5నుంచి ప్రక్రియను ఎన్నికల అధికారులు ప్రారంభించారు. డిసెంబర్ 13 నుంచి 15వరకు నామినేషన్ల స్వీకరణ, 16న నామినేషన్ల పరిశీలన, 17న ఉపంసహరణ, బరిలో నిలిచిన అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపులు ఉంటాయి. 26న ఓట్ల లెక్కింపు, 27న ఫలితాలను ప్రకటిస్తారు.
అంతర్జాతీయ గుర్తింపు..
విద్యుత్ ఆధారిత వ్యవసాయ ప్రాంతమైన సిరిసిల్ల జిల్లా ప్రాంతానికి ఏకైక సహకార విద్యుత్ సంస్థగా దినాదినాభివృద్ధి చెందుతున్నది. వినియోగదారులకు సేవలందించడంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 9 సహకార విద్యుత్ సంస్థలుండగా అందులో 8 బోర్డులో విలీనమయ్యాయి. వినియోగదారుల పట్టుదలతో సెస్ సహకార సంస్థ మాత్రమే కొనసాగుతూ వస్తున్నది. 1970లో ఏర్పాటైన ఈసంస్థకు పలు మార్లు పర్సన్ ఇన్చారిల్జుగా కలెక్టర్లు వ్యవహరించారు. 2016 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. 2021లో ఎన్నికలు జరుగాల్సి ఉండగా ప్రభుత్వం పాత పాలకవర్గాన్నే కొనసాగించింది. ఎన్నికలు నిర్వహించాలని కొందరు హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఉత్తర్వుల మేరకు డిసెంబర్లో నిర్వహించేందుకు ఎన్నికల అథారిటీ షెడ్యూల్ను జారీ చేసింది.
10 మండలాల్లో పొలిటికల్ హీట్..
నాలుగు నియోజకవర్గాల్లోని 11 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల పట్టణం, 10 మండలాల నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు పలువురు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఎలక్షన్స్కు పార్టీలతో సంబంధం లేకున్నా పరోక్షంగా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను నిలుపనున్నాయి. ఈ పరిస్థితుల్లో సెస్ ఎన్నికల్లో విజయం కోసం వారు శ్రమించనున్నారు. ఎన్నికలు జరిగే మండలాలు, సిరిసిల్ల పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కనున్నది.