రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఓ దివ్యాంగుడి పరిస్థితిని చూసి చలించిపోయారు. తన వద్దకు వచ్చిన ఆయన్న చూసి తన కుర్చీ దిగి కిందకు వెళ్లి స్వయంగా అర్జీ స్వీకరించారు. వినతి పత్రాన్ని తీసుకోవడమే కాదు, ఐదు నిమిషాల్లోనే బ్యాటరీ ట్రై సైకిల్ ఇప్పించి మానవత్వం చాటుకున్నారు. వీల్చైర్లో వచ్చిన ఆ దివ్యాంగుడు బ్యాటరీ ట్రై సైకిల్పై సంతోషంగా తిరిగివెళ్లాడు.
కలెక్టరేట్, జనవరి 9: కోనరావుపేట మండలం నిజామాబాద్కు చెందిన మారుపాక సత్తయ్య దివ్యాంగుడు. ట్రైసైకిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం సిరిసిల్ల కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి వీలైచైర్లో వచ్చాడు. ఆ దివ్యాంగుడి పరిస్థితిని గమనించిన కలెక్టర్ అనురాగ్జయంతి తన సీటు నుంచి లేచి వెంటనే అతని వద్దకు వచ్చారు. సమస్యను ఓపిగ్గా విన్నారు.
ట్రైసైకిల్ మంజూరు చేయాల్సిందిగా దివ్యాంగుడు అభ్యర్థించగానే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి తెప్పించి, సత్తయ్యకు స్వయంగా అందించా రు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్కు చెందిన తొగరి నాగరాజుకు కూడా కలెక్టర్ మాన్యువల్ ట్రైసైకిల్ అందజేశారు. అలాగే వినికిడి సమస్యతో బాధపడుతున్న సిరిసిల్ల వెంకంపేటకు చెందిన వెంగళ తిరుపతికి హియరింగ్ మిషన్ను అందజేశారు.