నిత్యం ప్రమాదపుటంచున పనిచేసే సింగరేణి బొగ్గు గని కార్మికులకు ఒక రకంగా.. ఆఫీసులో కూర్చొని పనిచేసే అధికారులకు మరో రకంగా చూడడంపై నిరసన వెల్లువెత్తుతున్నది. కార్మికులకు రూ. 8లక్షలు.. అధికారులకు రూ.25లక్షల హెల్త్కార్డులు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం కనిపిస్తున్నది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే సమాన కార్డులు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్, ఇప్పటికీ ఆ హామీని అమలు చేయకపోవడంపై కార్మిక కుటుంబాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
పెద్దపల్లి, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సింగరేణి విస్తరించి ఉన్న పదకొండు జిల్లాల్లో దాదాపుగా 38వేల మంది సింగరేణి బొగ్గుగని కార్మికులు పనిచేస్తున్నారు. ఆయా బొగ్గు బావులు ఓపెన్ కాస్టుల్లో దాదాపుగా 2వేల మంది వరకు ఆఫీస్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే భూగర్భ గనుల్లో, ఓపెన్ కాస్టు గనుల్లో పనిచేసే కార్మికులకు కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికేర్ స్కీం (సీపీఆర్ఎంఎస్) కింద కేవలం రూ.8లక్షల హెల్త్ కార్డులు ఉండగా.. అదే ఆఫీసుల్లో పనిచేసే అధికారులకు మాత్రం రూ.25లక్షల విలువైన హెల్త్ కార్డులను ఇచ్చారు. దీంతో కార్మికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం ప్రాణాలను పణంగా పెట్టి, ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ పనిచేసే తమకు తక్కువ విలువైన హెల్త్ కార్డులను ఇచ్చి, ఫ్లాన్ల కింద పనిచేసే ఉద్యోగులకు మాత్రం విలువైన హెల్త్ కార్డులను ఇవ్వడం సరికాదని సూచిస్తున్నారు. కార్మికులకు, అధికారులకు, సిబ్బందికి వ్యత్యాసం చూపకుండా సమానమైన హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

గత సంస్థాగత ఎన్నిక సమయంలో సింగరేణి వ్యాప్తంగా పర్యటించిన ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ మరిచారు. కార్మికులకు ఇస్తున్న రూ.8లక్షల హెల్త్ కార్డులను రూ.15లక్షలకు పెంచుతామని ఆయన వాగ్దానం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రిగా రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నప్పటికీ ఇచ్చిన హామీని మాత్రం అమలు చేయలేకపోయారు. అధికారులకు, సిబ్బందికి సమానమైన హెల్త్ కార్డులు ఇవ్వాలనే డిమాండ్ వస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో మల్లు భట్టి విక్రమార్క తీరుపై కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, భట్టి విక్రమార్క ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలలి. కార్మికులు కోరుతున్న విధంగా కార్మికులకు, అధికారులకు సమానమైన సీపీఆర్ఎంఎస్ హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఈ విషయంలో రెండున్నరేళ్లుగా ఒక్క సారి కూడా డిప్యూటీ సీఎం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇది సింగరేణి కార్మికులను మోసం చేయడమే. ఇప్పటికైనా మంత్రి ఈ విషయంలో చొరవ చూపి సమానమైన హెల్త్ కార్డులను ఇప్పించాలి.
-మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు