ఉమ్మడి జిల్లాను చలి వణికిస్తున్నది. నాలుగు రోజులుగా భయపెడుతున్నది. మొన్నటిదాకా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మధ్య నమోదు కాగా, గురువారం రాత్రి 10.7 డిగ్రీలకు పడిపోయింది. మరో వైపు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా మొన్నటి వరకు 35 డిగ్రీల నుంచి 32 డిగ్రీల మధ్య నమోదు కాగా, గురువారం 30 డిగ్రీలకు పడిపోయింది. చాలా చోట్ల ఉదయం 8 గంటల దాకా పొగమంచు కనిపిస్తుండగా, పొద్దంతా చల్లని గాలులు వీస్తున్నాయి. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పడిపోతున్నాయి. దీంతో జిల్లావాసులు వణికిపోతున్నారు. ఉదయం, సాయంత్ర వేళ ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
– కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 17