రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): కార్మిక క్షేత్రంలోని నివాసాలు, డైయింగ్లు, వివిధ పరిశ్రమల నుంచి వెలువడుతున్న మురుగు నీటి సమస్యకు మంత్రి కేటీఆర్ శాశ్వత పరిష్కారం చూపారు. నీరంతా సమీప మానేరు వాగులో కలిసి కలుషితమవుతున్నది. శివారులోని పచ్చని పొలాల్లోకి చేరిన మురుగు నీటితో పంటలు నష్టపోతున్నాయి. ఇటు రైతులు, అటు ప్రజల కోరిక మేరకు అమాత్యుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
నీటిని శుద్ధి చేసే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)ను మంజూరు చేయించారు. రూ. 61.50 కోట్లతో ఆరెకరాల్లో నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఆరునెలల క్రితం నిర్మాణ పనులు ప్రారంభించగా, 90 శాతం పనులు పూర్తి కావచ్చాయి. శాంతినగర్లోని నర్సింగ్ కళాశాల, డబుల్ బెడ్రూం ఇండ్ల సమీపంలో ఈ ప్లాంట్ను బల్దియా నిర్మిస్తున్నది. నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నందున త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉండేలా..
గతంలో ఎటు కిలోమీటరు దూరం పరిధి మాత్రమే ఉండే సిరిసిల్ల పట్టణం రోజురోజుకూ విస్తరిస్తున్నది. జిల్లా కేంద్రం ఏర్పాటు చేసిన కేటీఆర్ పట్టణానికి ఇరువైపులా వంద ఫీట్లతో రహదారులను మంజూరు చేయించారు. కోట్లాది రూపాయలతో మానేరు బ్రిడ్జి నుంచి రగుడు జంక్షన్ వరకు, అక్కడి నుంచి వెంకటాపూర్ గ్రామం ఆరువరుసల బైపాస్ రోడ్లు నిర్మించారు. వాటితో పాటు రింగురోడ్డును కలిపేలా మానేరు వాగులో మరో రహదారిని నిర్మిస్తున్నారు. నూతన భవనాల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. కొత్తగా శ్రీనగర్కాలనీ ఏర్పాటు కాగా, శివారులోని ఏడు గ్రామాలు బల్దియాలో విలీనం చేశారు. మొత్తం జనాభా 1.11లక్షలుండగా, 21980 వరకు నివాసాలున్నాయి.
ఇందులో ముఖ్యంగా మరమగ్గాలు, అద్దకం (డైయింగ్) పరిశ్రమలు, సైజింగ్లు, దవాఖానలు, ల్యాబ్లు, ఇతర పరిశ్రమలున్నాయి. నివాసాలు, పరిశ్రమల నుంచి రోజుకు 3.19మిలియన్ లీటర్ల మురుగు నీరు వెలువడుతున్నది. రోజుకు ఇన్ని మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేయనుండగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 19.3 లీటర్ల శుద్ధి చేసే సామర్థ్యం గల ప్లాంటను నిర్మిస్తున్నారు. రహదారులు, గ్రామాల్లో నిర్మించిన మురుగు కాలువల ద్వారా నీరంతా శాంతినగర్ వద్ద గల తుమ్మల కుంటకు చేరుతుంది. విస్తరిస్తున్న అవసరాలకు అనుగుణంగా తుమ్మల కుంట సరిపోనందున ఎస్టీపీ నిర్మాణం చేపట్టాలని బల్దియా నిర్ణయించింది.
త్వరలో అందుబాటులోకి …
సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను త్వరలో అందుబాటులోకి తచ్చేలా బల్దియా సన్నాహాలు చేస్తున్నది. 6 ఎకరాలలో నిర్మిస్తున్న ప్లాంట్లో అడ్మినిస్ట్రేటివ్ భవనం, సీక్వెన్సింగ్ బాచ్ రియాక్టర్ బేసిన్, క్లారీ పాయర్ నిర్మాణం పూర్తి కావచ్చింది. రాసీలెజ్ సంపు 33 ఫీట్ల లోతు, సుమారు వంద ఫీట్ల వెడల్పుతో పెద్ద బావి (సంపు) నిర్మాణం పూర్తయింది. మురికి నీటిలో ఉన్న బ్యాక్టీరియాను తొలగించేందుకు శుద్ధి చేసిన నీటిని మరో సంపులోకి పంపిస్తారు. శుద్ధి చేసిన నీటిని వివిధ నిర్మాణ పనులకు, పంటచేలకు, ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.
మురుగు నీటి కష్టాలు తీరుతయ్
మాది సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్. మానేరు వాగు పక్కనే నాలుగెకరాల పొలం ఉంది. ఊళ్లే నుంచి వచ్చే మురుగు నీరంతా మాపొలం పక్కనే ఉన్న తుమ్మలకుంటకు చేరుతుంది. తాతల కింద కట్టిన తుమ్మల కుంట నిండిపోయి నీళ్లన్ని మాపొలాల్లోకి వచ్చి పంటను నాశనం జేత్తున్నయ్. ఎన్నో సార్లు మున్సిపాల్టీ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. కేటీఆర్ సార్ వచ్చినపుడు రైతులందరం కలిసి మా బాధలు చెప్పుకుంటే ఇయ్యాల శుద్ధిచేసే ప్లాంటును కట్టిత్తన్నడు. మురుగు నీటి కష్టాలు తీరుతున్నందుకు సంతోషంగా ఉంది.
-జే గడప కృష్ణహరి, సిరిసిల్ల
పంటంతా పాడైతంది
తుమ్మల కుంట కిందనే నాకు మూడెకరాలుంది. వరి పంటేసినా. ఇండ్లల్ల నుండి వచ్చే మురుగు నీరంతా ఈడికే వత్తుండే. వానాకాలంలో నైతే పొలం కాడికి పోదామంటే గలీజ్ నీళ్లలోనుంచే అడుగేసుకుంటూ ముక్కు మూసుకుంటూ పోతుంటిమి. కుంట నిండి ఎక్కువైన నీళ్లన్ని మాపొలంలోకి పారుతుండే. పొలమంతా పాడైతందని మంత్రి కేటీఆర్ సార్కు చెప్పుకుంటే మీబాధలు తొందరలోనే తీరుతయన్నడు. అందరు గిట్లనే జెప్పుతరనుకున్నం. ఇయ్యాల నీటిని శుద్ధి చేసే ప్లాంట్ ఇక్కడే కడుతున్నరు. మురుగు నీరంతా శుద్ధి జేసి మాపొలాలకే ఇత్తమంటున్నరు. కేటీఆర్సార్కు రుణపడి ఉంటం
-కే ముదాం వెంకటేశం, శాంతినగర్ సిరిసిల్ల