కోనరావుపేట , డిసెంబర్ 27 : స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకారులతోపాటు పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ పెద్దపీట వేస్తున్నారు. మంత్రి కేటీఆర్ కూడా తన సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలో ఆయా వర్గాలకు అన్నింటా చోటు కల్పిస్తున్నారు. వస్త్ర పరిశ్రమను పండుగలా మార్చి నేతకార్మికులకు వెన్నుదన్నుగా నిలిచారు. కోట్లాది రూపాయలతో ఆర్డర్లతో చేతినిండా పని కల్పించారు. మరోవైపు పద్మశాలీల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. ఇటీవలే గూడూరి ప్రవీణ్కు టీపీటీడీసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. వీరితోపాటు అన్ని వర్గాలకూ ప్రాధాన్యం ఇస్తున్నారు.
తాజాగా, సెస్ ఎన్నికల్లోనూ అదే తీరున సముచిత స్థానం కల్పించారు. ఇది వరకే చైర్మన్గా పనిచేసిన అనుభవమున్న చిక్కాల రామారావుకు మళ్లీ చైర్మన్ పదవిని ఇచ్చినా.. వైస్ చైర్మన్ పదవిని మాత్రం చరిత్రలోనే మొదటిసారిగా విశ్వబ్రాహ్మణుడైన దేవరకొండ తిరుపతికి కట్టబెట్టారు. అయితే, సెస్ 52 ఏండ్ల ప్రస్థానంలో విశ్వబ్రాహ్మణులకు పదవి ఇవ్వడం ఇదే మొదటిసారి కాగా, ఆ కులస్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం దక్కుతుందనడానికి తిరుపతే నిదర్శనమని చెబుతున్నారు.
ఉద్యమకారుడికి సముచితస్థానం..
ఉద్యమకాలం నుంచి చురుకుగా పనిచేస్తున్న తిరుపతికి సముచిత స్థానం కల్పించారు. సీఎం కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం నుంచి మేమంతా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అందుకే ఎమ్మెల్యే రమేశ్బాబు గుర్తించి ప్రతిసారి తనకు అవకాశమిచ్చారు. మిగతా గ్రామస్తులతోపాటు విశ్వబ్రాహ్మణ కులస్తులమంతా కలిసి భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం. ఆ సంతోషం మరువక ముందే సెస్ చరిత్రలోనే తొలిసారిగా విశ్వబ్రాహ్మణ కులస్తుడికి వైస్చైర్మన్గా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు.
– దేవరకొండ సంపత్, కోనరావుపేట
గతంలో ఎవరూ గుర్తించలే
ఇదివరకటి ప్రభుత్వాలు విశ్వబ్రాహ్మణులను పట్టించుకోలె. ఎవరూ గుర్తించలే. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని కులాలకు సమప్రాధాన్యమిచ్చిండ్రు. పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరినీ గుర్తిస్తూ అవకాశాలు కల్పిస్తున్నరు. రెండు సార్లు గెలిచిన దేవరకొండ తిరుపతిని వైస్చైర్మన్గా నియమించడం సంతోషంగా ఉంది. విశ్వబ్రాహ్మణుడిని గుర్తించి బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. -సంకోజి సత్తయ్య, మామిడిపల్లి (కోనరావుపేట)
కులవృత్తులకు గౌరవం
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని కులాలకు సమాన హక్కులను కల్పిస్తున్నారు. కులవృత్తులు అంతరించిపోకుండా జీవం పోస్తున్నారు. వడ్రంగులకు గతంలో విద్యుత్ సౌకర్యం లేక అనేక కష్టాలను ఎదుర్కొన్నాం. 24 గంటలు నిరంతర విద్యుత్ అందిస్తూ మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించడం సంతోషకరం. సెస్ పరిధిలో మా కులస్ధుడైన దేవరకొండ తిరుపతికి అవకాశం కల్పించి మంచి పదవిని కట్టబెట్టిన మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్బాబు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణకు ప్రత్యేక కృతజ్ఞతలు. – మామిడిపల్లి శ్రీనివాస్, నిజామాబాద్(కోనరావుపేట)
సెస్ చరిత్రలోనే తొలిసారి
సెస్ చరిత్రలోనే తొలిసారిగా విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన యువ నాయకుడు తిరుపతిని వైస్చైర్మన్గా నియమించడం హర్షనీయం. ఎమ్మెల్యే రమేశ్బాబు ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్న వ్యక్తిపై నమ్మకం ఉంచి రెండు సార్లు అవకాశమిచ్చారు. మంచి మెజార్టీతో అతడిని గెలిపించాం. డైరెక్టర్గా గెలుపొందిన తిరుపతికి జిల్లాలో మంచి స్థానం కల్పించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
–దర్శనాల శేఖర్, వట్టిమల్ల (కోనరావుపేట)
అన్ని కులాలకు సమ ప్రాధాన్యం
గతంలో ఎన్నడూ లేన విధంగా అన్ని కులాలకు సమప్రాధాన్యం కల్పించడం హర్షనీయం. ఏండ్లు గడుస్తున్నా కులాల మధ్య చిచ్చు పెడుతూ నాయకులు ముందుకు వెళ్తున్నారు. సీఎం కేసీఆర్ మాత్రం కులాల తారతమ్యం లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నారు. సెస్లో ఎప్పుడూ లేని విధంగా విశ్వబ్రాహ్మణుడికి మంచి పదవిని కట్టబెట్టి బాధ్యత పెంచారు.
– బూరుగుపల్లి కిషన్, నిజామాబాద్(కోనరావుపేట)
విశ్వబ్రాహ్మణ వర్గానికి వైస్ చైర్మన్ పదవి
సెస్ చరిత్రలో ఎన్నడు విశ్వబ్రాహ్మణ వర్గానికి పదవులు రాలేదు. గత ప్రభుత్వాలు విస్మరించాయి. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది. అందరికీ సముచిత స్థానం కల్పిస్తున్నదని చెప్పడానికి ఈ పదవే నిదర్శనం. మా సామాజిక వర్గానికి చెందిన కోనరావుపేట సెస్ డైరెక్టర్కు వైస్ చైర్మన్ పదవి కల్పించిన మంత్రి కేటీఆర్, నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జిల్లా అద్యక్షుడు తోట ఆగయ్యకు విశ్వబ్రాహ్మణుల సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా.
– విశ్వబ్రాహ్మణ సంఘం గంభీరావుపేట మండల అధ్యక్షుడు కొలనూరి వేణుగోపాలాచారి