స్పష్టమైన మెజార్టీ.. గెలుపు ఏకపక్షం
ఎన్నికలకు వెళ్లేందుకే నిర్ణయం?
రాజీలు, కాంప్రమైజ్లు, చర్చలు అసలే వద్దు
మంత్రులు, ఇన్చార్జిలు, నేతల ఏకాభిప్రాయం
అధిష్టానం నిర్ణయానికి విరుద్ధంగా నామినేషన్ల్లుదాఖలు చేసిన వారిపై సీరియస్
స్వచ్ఛందంగా విరమించుకోవాలని సూచన
కరీంనగర్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే నిర్ణయం తీసుకున్నది. అధికార పార్టీ అభ్యర్థులు కాంప్రమైజ్కు వస్తారని, తద్వారా తమ పబ్బం గడుపుకోవచ్చని భావించి నామినేషన్లు వేసిన నేతలకు వణుకు పుట్టించేలా అడుగులు వేస్తున్నది. గులాబీ అభ్యర్థులు విజయం సాధించడానికి అవసరానికి మించిన సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో.. పబ్బంరాయుళ్లతో ఎలాంటి రాజీలు, సంప్రదింపుల ప్రసక్తే లేకుండా నేరుగా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైంది.
ఈ విషయంలో మంత్రులు, నియోజకవర్గ ఇన్చార్జిలు, నాయకులంతా ముక్తకంఠంతో ఒకే మాటపై నిలిచారు. ఇదే సమయంలో పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా నామినేషన్లు దాఖలు చేసిన వారు విత్డ్రా చేసుకొని.. పార్టీతో కలిసి రావాలని అమాత్యులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు. ఇటు ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులను ఇప్పటికే క్యాంపునకు తరలిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎల్.రమణ, టి.భానుప్రసాద్రావు మంగళవారం నామినేషన్లు సమర్పించారు. మొత్తం 27 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. అందులో మూడు రిజెక్టు కాగా.. 24 మంది బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ బుధవారం ప్రకటించారు. ఈ నెల 26 వరకు ఉపసంహరణ గడువు ఉంది. అయితే.. ఏమాత్రం సంఖ్యాబలం లేకపోయినా.. కనీసం చెప్పుకోవడానికి నాలుగు ఓట్లు లేని ఎంతో మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అధికార పార్టీ అభ్యర్థుల గెలుపునకు కావాల్సిన దానికి మించి సంఖ్యాబలం ఉంద ని తెలిసినా.. నామినేషన్లు దాఖలు చేయడం వెనుక కుట్ర లు, కుతంత్రాలున్నాయి. కొంతమంది దురాశ కూడా దీని వెనుక ఉంది. నిజానికి ఉమ్మడి జిల్లాలో ఈ ఎన్నికల్లో ఓటు వినియోగించుకునే వారి సంఖ్య 1326. అందులో 1050కిపైగా సంఖ్యాబలం టీఆర్ఎస్కు ఉంది. గెలుపు ఏ కపక్షంగా కనిపిస్తున్నది. ఇంత స్పష్టమైన మెజార్టీ ఉన్నా.. కొంతమంది తాము బరిలో ఉంటే అధికార పార్టీ నేతలు తమతో కాంప్రమైజ్కు వస్తారని, తద్వారా తమ పబ్బం గడుపుకోవచ్చన్న ఉద్దేశంతో నామినేషన్లు వేశారన్న అభిప్రాయాలు ఇప్పటికే చాలా మందిలో వ్యక్తమయ్యాయి.
బతుకునిచ్చిన పార్టీకి ఎసరు..
నామినేషన్లు వేసిన వారిలో కొంత మంది టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న వారున్నారు. నామినేషన్లు దాఖ లు చేసిన అభ్యర్థులకు కొంతమంది సంతకాలు పెట్టి మద్దతు ఇచ్చిన వారున్నారు. ఈ విషయాన్ని పార్టీ సీరియస్గా పరిగణలోకి తీసుకున్నది. ‘తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు’.. సొంత పార్టీలోనూ ఉంటూ తూట్లు పొడిచేందుకు ప్రయత్నిస్తున్న నాయకుల తీరును తీవ్రంగా పరిగణిస్తున్నది. అంతేకాదు, సదరు నాయకులు వాస్తవాలు గు ర్తించి ఇప్పటికైనా తమ తమ నామినేషన్లు స్వచ్ఛందంగా ఉపసంహరించుకొని పార్టీ నాయకులతో కలిసి క్యాంపులకు రావాలని మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా పార్టీ అధిష్టానం సమాలోచనలు చేస్తున్నది.
ఎన్నికలకే వెళ్దాం..
గెలుపు ఏకపక్షంగా ఉండడమే కాదు, ఏ పార్టీ కూడా టీఆర్ఎస్కు దరిదాపుల్లో లేదు. 80 శాతానికిపైగా ఓట్లు టీఆర్ఎస్వైపు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కుట్రలు, కుతంత్రాలు, లేదా కాంప్రమైజ్పేరుతో తమ పబ్బం గడుపుకోవాలని కొంత మంది నామినేషన్లు దాఖలు చేసిన విషయాన్ని గమనించి టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా నాయకత్వం అందరి అంచనాలకు భిన్నంగా దిమ్మదిరిగే నిర్ణయం తీసుకున్నది. ఏకంగా ఎన్నికలకు వెళ్లి.. తేల్చుకోవాలని నిర్ణయం తీసుకున్నది. స్పష్టమైన సంఖ్యాబలం ఉందని తెలిసి.. ఇతరులు నామినేషన్లు వేయడంలోనే వారి వారి దురుద్దేశం అర్థమవుతుందని, కాబట్టి.. ఏపరిస్థితుల్లోనూ ఇతరులతో చర్చలు, సంప్రదింపులు, రాజీలు, కాంప్రమైజ్లు చేయవద్దని మొత్తం సభ్యులు ముక్తకంఠంతో అధిష్టానానికి చెప్పారు. ఇదే అభిప్రాయాన్ని మంత్రులు, నియోజకవర్గ ఇన్చార్జిలు సైతం వ్యక్తం చేశారు. దీంతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్న పార్టీ నాయకత్వం.. ఆయా నియోజకవర్గాల స్థానిక ప్రజాప్రతినిధులతో గురువారం నుంచి క్యాంపునకు వెళ్లడానికి నిర్ణయం తీసుకున్నది. వివిధ రాష్ర్టాల్లో ఉన్న అనేక పర్యాటక కేంద్రాలకు అంటే ఒక్కో నియోజకవర్గం ప్రజాప్రతినిధులు ఒక్కోవైపు వెళ్లాలని నిర్ణయించి ఆ మేరకు సర్వం ఏర్పాట్లు చేసింది.
ఇప్పడేం చేద్దాం..?
టీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇతరుల్లో గుబులు రేపుతున్నది. ఎలాగూ సంప్రదింపులకు వస్తారని భావించిన నేతల్లో ఇప్పుడు ఆందోళన మొదలైంది. అధిష్టానం నిర్ణయానికి భిన్నంగా సొంత పార్టీలో నామినేషన్లు వేసిన వారు సైతం షాక్కు గురవుతున్నారు. తమ వద్దకు వచ్చి అభ్యర్థిస్తారని, లేదా పెద్ద నాయకులు మాట్లాడుతారని, తద్వారా తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుందని భావించిన సదరు నాయకుల ఆశలకు కళ్లెం పడింది. అంతేకాదు.. ఏకంగా సదరు వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని సైతం నిర్ణయాలు తీసుకోవడంతో వారిలో భయం మొదలైంది. అలాగే ఈ నామినేషన్ ద్వారా తమ తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలన్న అశతో నామినేషన్లు సమర్పించిన చేసిన వారి గుండెల్లోనూ రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పుడేం చేద్దామన్న ఆలోచనలు సదరు నేతల్లో మొదలుకాగా, టీఆర్ఎస్ మాత్రం తమ నేతలను క్యాంపునకు తరలించేందుకు పూర్తి సమాయత్తమైంది.