హుజూరాబాద్టౌన్, జనవరి 26: పట్టణానికి చెందిన సీనియర్ క్రికెట్ క్రీడాకారుడు బండారి లవన్(38) గుండెపోటుతో దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో లవన్ క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు వచ్చింది. గమనించిన తోటి క్రీడాకారులు అతడిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ లవన్ చనిపోయాడు.
లవన్ మృతి స్థానిక క్రీడాభిమానుల్లో విషాదం నింపింది. గురువారం లవన్ మృతదేహాన్ని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్యాదవ్, హాకీ క్లబ్ అధ్యక్షుడు, పార్టీ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, పురపాలక సంఘం చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు, క్రీడాకారులు, వాకర్స్ సభ్యులు సందర్శించి, నివాళులర్పించారు.
పాడె మోసిన కౌశిక్రెడ్డి
ఒకప్పుడు క్రికెటర్ అయిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి క్రికెట్ ఆడుతూనే మృత్యువాత పడిన లవన్ అంత్యక్రియల్లో పాల్గొని, పాడె మోశారు. క్రీడాకారుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. లవన్ మృతికి సంతాపంగా నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు సెలూన్ షాపుల బంద్ పాటించారు.