సారంగాపూర్, నవంబర్ 30 :ఊరి ప్రజలందరూ ఒక్కతాటిపైకి వచ్చారు..విద్యార్థుల్లేక, కనీస వసతుల్లేక వెలవెలబోతున్న గ్రామంలోని నాలుగు ప్రాథమిక, జిల్లా పరిషత్ పాఠశాలల అభివృద్ధికి పూనుకున్నారు. ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటికీ వెళ్లారు. తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరించారు. వెరసి విద్యార్థుల సంఖ్యను పెంచడమే గాకుండా, అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఏడో తరగతి దాకా ఆంగ్లమాధ్యమంలో బోధనకు అనుమతులు సాధించి ‘బడి’ని బతికించుకున్నారు అర్పల్లి గ్రామస్తులు..
మండలంలోని అర్పల్లికి చెందిన విద్యార్థులందరూ ప్రైవేట్ బడులకు వెళ్తుండడంతో గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని పీఎస్, గొల్లవాడ , బెస్తావాడ , చాకలివాడ పీఎస్లలో ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కరోనా ఇతరత్రా కారణాలతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో ఇక్కడ స్కూళ్లలోని టీచర్లను ఇతర స్కూళ్లలో నియమించే పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ పోస్టులు తరలిపోకుండా చూడడమే గాకుండా సర్కారు బడులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు గ్రామస్తులు ఏకమయ్యారు. సర్పంచ్ కొండ శ్రీలత, ఆర్బీఎస్ కోఆర్డినేటర్ కొండ ప్రభాకర్, ఉన్నత పాఠశాల హెచ్ఎం నరేందర్, పీఎస్ల హెచ్ఎంలు ఆనందం, శ్రీనివాస్, కాళిదాస్, సత్యనారాయణ కలిసి ఇంటింటికీ తిరిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులపై తల్లిదండ్రులకు వివరించారు. ఇంగ్లిష్ మీడియం బోధిస్తామని మాటివ్వడంతో ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఒక్కో ప్రాథమిక పాఠశాలలో 42 మంది చొప్పున చదువుకుం టున్నారు. జడ్పీ స్కూల్లో విద్యార్థుల సంఖ్య 93కు పెరిగింది. పీఎస్లలో 1నుంచి 5వ తరగతి వరకు, ఉన్నత పాఠశాలలో కూడ 6,7 తరగతులను ఇంగ్లిష్లో బోధిస్తున్నారు. కరోనా సమయంలో ఒకటి, రెండు తరగతుల వారికి ఆన్లైన్లో, 3,4,5, తరగతుల విద్యార్థులకు ఇండ్లళ్లకు వెళ్లి బోధించారు. అలాగే స్కూల్లో విరివిగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించారు.
స్కూళ్లను ఆదర్శంగా నిలుపుతాం..
విద్యార్థుల సంఖ్య పడిపోవడంతో బడులు మూసేసే పరిస్థితి వచ్చింది. ఇక్కడి టీచర్ల పోస్టులు తరలిపోయే పరిస్థితులు వచ్చాయి. దీంతో పాలకవర్గం, ఉపాధ్యాయులు కలిసి ఇంటింటికీ వెళ్లినం. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారి పిల్లలను చేర్పించినం. ఇంగ్లిష్ బోధన ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నం. ఈ యేడు మంచి ఫలితాలు సాధించి స్కూళ్లను ఆదర్శంగా నిలుపుతాం.
సమష్టి కృషితోనే సాధ్యమైంది..
గ్రామస్తులు, టీచర్లు, ప్రజాప్రతినిధుల కృషితోనే పాఠశాలలకు పూర్వ వైభవం వచ్చింది. ఇందుకు అధికారులు సైతం సహకరించారు. పక్కా ప్రణాళికతో ఫలితాలు సాధించినం, ఇప్పుడు విద్యార్థుల సంఖ్య పెరిగింది. పదో తరగతిలో మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేస్తాం.
వసతుల కల్పనకు కృషి చేస్తున్నాం
గ్రామ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందిరి సహకారంతో విద్యార్థుల సంఖ్యను పెంచుకోగలిగాం. విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఐదు తరగతులను ఇంగ్లిష్ మీడియంగా మార్చారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పినకు మా వంతు కృషి చేస్తున్నాం.