హుస్నాబాద్, అక్టోబర్ 26: హుస్నాబాద్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కారు జోరందుకుంది.ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ ఆధ్వర్యంలో గ్రామాల్లో గులాబీ ప్రచార హోరు ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రతిపక్ష నాయకుల టికెట్లు ఖరారు కాకుండా ఆయా పార్టీల నాయకులు ఏం చేయాలో తోచక అయోమయంలో ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సతీశ్కుమార్ మాత్రం ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రెండు మండలాల్లో ప్రచారం ప్రారంభించిన సతీశ్కుమార్ ఒక ప్రణాళిక ప్రకారం ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
గ్రామానికి వచ్చిన సతీశ్కుమార్కు జననీరాజనం లభిస్తోంది. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా సతీశ్కుమార్ను పిలుచుకునే పార్టీ క్యాడర్ ఆయా గ్రామాల్లో రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో పాల్గొంటున్నారు. మూడోసారి కూడా భారీ మెజార్టీతో సతీశ్కుమార్ను గెలిపించి గులాబీ జెండాకు తిరుగులదని నిరూపించుకోవాలని పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పట్టుదలతో పనిచేస్తున్నారు. దీంతో హుస్నాబాద్లో గులాబీ జెండా మూడోసారి రెపరెపలాడటం ఖాయమనేది స్పష్టమవుతోంది.
హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ తన మొట్టమొదటి ప్రచారాన్ని నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలం జగన్నాథపురంలో సెప్టెంబర్ 6న షురూ చేశారు. స్థానిక హనుమాన్ దేవాలయంలో కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రత్యేక పూజల అనంతరం అదే గ్రామంలో ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించారు. అనంతరం అక్కన్నపేట మండలంలోని మంచినీళ్లబండ గ్రామంతో ప్రచారాన్ని ప్రారంభించి రోజుకు 6నుంచి 10 గ్రామాల్లో సుడిగాలి పర్యటనల ద్వారా ప్రచారాన్ని హోరెత్తించారు.
అక్కన్నపేట మండలంలోని 31 గ్రామ పంచాయతీల్లో ఏడు గ్రామాలు మినహా మిగతా అన్ని గ్రామాల్లో మొదటి విడత ప్రచారాన్ని పూర్తి చేశారు. 26వ తేదీ గురువారం భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం అక్కడ ప్రచారం ప్రారంభించారు. కొత్తకొండ గ్రామం అనంతరం చంటయ్యపల్లి, ధర్మారం, రసూల్పల్లి, వీర్లగడ్డతండా, మల్లారం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో మొదటి విడత ప్రచారాన్ని పూర్తి చేసి రెండో విడత ప్రచారానికి సైతం ఎమ్మెల్యే సతీశ్కుమార్ సన్నద్ధం అవుతున్నారు.
సీఎం కేసీఆర్కు సెంటిమెంట్గా భావించే హుస్నాబాద్లో ఈనెల 15న జరిగిన ప్రజా ఆశీర్వాద సభతో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఎమ్మెల్యే సతీశ్కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సీఎం కేసీఆర్కు ఇష్టమైన హుస్నాబాద్లో మళ్లీ గులాబీ జెండానే ఎగిరేలా కలిసికట్టుగా పనిచేయాలనే లక్ష్యంతో పార్టీ క్యాడర్ ముందుకు పోతోంది. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సైతం తిప్పి కొడుతూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంతో పాటు గ్రామాల్లోనూ ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ముందుకు
సాగుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ…ప్రచారానికి వచ్చిన కార్యకర్తలు, ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే సతీశ్కుమార్ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా అక్కడ జరిగిన అభివృద్ధిని కూలంకశంగా వివరిస్తున్నారు. అక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలను సైతం వివరిస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఇంకా పరిష్కారం కాని సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులను, పాత, కొత్త క్యాడర్ను కలుపుకుపోతున్నారు. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరే యువకులు, నాయకులకు కండువాలు కప్పి ఆహ్వానిస్తున్నారు. హుస్నాబాద్ వరప్రదాయని గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణం, దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడంతో పాటు మూడోసారి ప్రజలు ఆశీర్వదిస్తే ఏం చేయబోతున్నారనే విషయాలను కూడా ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.