కార్పొరేషన్, డిసెంబర్ 8: విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రవీందర్సింగ్ అంచెలంచెలుగా ఎదిగారు. ప్రజాసేవలో తరించిన ఆయనను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ స్టేట్ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్లో గురువారం జరిగిన రవీందర్సింగ్ కూతురు పూజగగన్దీప్ కౌర్ వివాహనికి సీఎం కేసీఆర్ హాజరై వధూవరులను ఆశ్వీరదించి వెళ్లిన గంటలోనే సర్కారు అతడిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. కేసీఆర్ ఆయనకు కూతురి పెండ్లికి కానుక ఇచ్చారన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
రవీందర్సింగ్ 1995లో కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. నాటి నుంచి 27 ఏండ్లుగా కరీంనగర్ కౌన్సిలర్గా, కార్పొరేటర్గా కొనసాగుతున్నారు. 2001లో బీజేపీ నుంచి కరీంనగర్ బల్దియా బరిలో నిలిచి విజయం సాధించారు. నాలుగేండ్లపాటు ప్లోర్ లీడర్గా పనిచేశారు. 2005లోనూ ఆ పార్టీ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచారు. ప్రజా సమస్యలపై గళమెత్తి పరిష్కారానికి కృషి చేశారు.
అప్పటి ఉద్యమ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునందుకొని 2007లో బీజేపీకి రాజీనామా చేశారు. కేసీఆర్ సమక్షంలో ఉద్యమపార్టీ టీఆర్ఎస్లో చేరారు. పార్టీ కార్యక్రమాలు, ప్రత్యేక తెలంగాణ పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. కేసీఆర్ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కర్తవ్యదీక్షతో విజయవంతం చేశారు. సకల జనుల సమ్మె, రైల్రోకో, సడక్ బంద్, వంటావార్పు లాంటి కార్యక్రమాలు జయప్రదం చేయడంలో ముందువరుసలో నిలిచారు. అనతి కాలంలోనే కేసీఆర్ ముఖ్య అనుచరుడిగా గుర్తింపు దక్కించుకున్నారు. 2008లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. 2010 నుంచి టీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షుడిగా కొనసాగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినా తర్వాత 2014లో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్గా గెలిచి మేయర్గా ఐదేళ్ల పాటు కొనసాగారు. దక్షిణ భారత దేశంలోనే మొట్టమొదటి సికు సామాజిక వర్గానికి మేయర్గా గుర్తింపు పొందారు.
తన హయాంలో నగరంలో నిరుపేద కుటుంబాలకు రూపాయికే నల్లా కనెక్షన్, దహనసంస్కారాలు వంటి పథకాలను తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం కరీంనగర్ నగరపాలక సంస్థ 51వ డివిజన్ కార్పొరేటర్గా కొనసాగుతున్నారు. కూతురు పెండ్లినాడే రవీందర్సింగ్కు పదవి రావడంపై అభిమానులు సంతోషంలో మునిగితేలారు. తమ అధినేత చెప్పిన బాటలో నడువడమే కాదు.. ఏ పదవి ఇచ్చినా దానికి పూర్తి న్యాయం చేసి తీరుతామని, బతికి ఉన్నంత వరకు కేసీఆర్ వెంటే ఉండి రుణం తీర్చుకుంటామని సర్దార్ ప్రకటించారు. తన కూతురు పెళ్లినాడే తనకు పదవి రావడం జీవితంలో మరుపురాని రోజన్నారు. ఇంతటి అదృష్టాన్ని కల్పించిన ముఖ్యమంత్రికి, పార్టీ అధ్యక్షుడు మంత్రి కేటీఆర్కు జిల్లా మంత్రులు, నాయకులు, యావత్తు టీఆర్ఎస్ శ్రేణులకు, పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు.