Odela | ఓదెల, జూన్ 8 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పిట్టల ఎల్లయ్య పల్లె గ్రామంలో సోమవారం బడిబాట కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు వినూత్నంగా నిర్వహించారు. ఇక్కడ గ్రామంలో ఇంటింటికి తిరిగిన ఉపాధ్యాయులు బడిలో చేర్పించిన విద్యార్థి తల్లిదండ్రులకు ఒక మొక్కను బహుకరించారు. ఇందువల్ల ప్రభుత్వ బడి బలోపేతం అవడంతో పాటు ఇంటిలో పచ్చని మొక్క ఆహ్లాదంగా ఉండటంతో చక్కని గాలి దొరకనుందన్నారు.
ఈ వినూత్న కార్యక్రమంతో ఇక్కడి ఉపాధ్యాయులు ముందుకు వెళ్లడాన్ని పలువురు అభినందిస్తున్నారు. గ్రామస్తులో కూడా హర్షం వ్యక్తమవుతోంది. బడిబాటలో భాగంగా బడీడు పిల్లల ఇండ్లను సందర్శించి ప్రీ ప్రైమరీ నుండి ఐదో తరగతి వరకు అడ్మిషన్స్ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తౌటం సంతోష్, ఉపాధ్యాయురాలు సుమలత, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.