సంక్రాంతి పండుగ సమీపిస్తున్నది. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు ప్రభుత్వోద్యోగులతోపాటే తమకు కూడా వేతనాలు వస్తాయని ఆశించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ఒకటో తారీఖు పోయి పన్నెండో తారీఖు వచ్చినా వేతనాలు పడక ఎదురుచూపులు చూడాల్సి వస్తున్నది. పండుగ వేళ ఇరుగు, పొరుగు కుటుంబాలు పిండి వంటలు చేస్తుంటే తమ కుటుంబాల్లోని పిల్లలు ఆర్తిగా చూసే పరిస్థితి వస్తున్నదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ చూపాలని, ప్రభుత్వం నుంచి జీతాలు త్వరగా ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
Salaries | కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 11 : కరీంనగర్ జిల్లాలో ప్రధాన ప్రభుత్వ శాఖల్లో ఒప్పంద ప్రాతిపదికన సుమారు 700 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్లో 117 మంది, విద్యాశాఖకు సంబంధించి పలు విభాగాల్లో 555 మంది, ఉన్నత విద్యాశాఖలోనూ అత్యధికంగా పని చేస్తున్నారు. వీరు ఏండ్లకేండ్లుగా ఈ కొలువుల్లో కొనసాగుతున్నారు. పరిమితంగా వచ్చే వేతనాలపైనే ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇన్నాళ్లూ జీతాలు వెనుకాముందైనా.. పండుగ సమయాల్లో మాత్రం ముందుగానే వచ్చేవని చెబుతున్నారు.
అయితే ఈ సారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని వాపోతున్నారు. ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ప్రతి నెలా ఒకటో తారీఖునే అన్ని శాఖల్లోని ఒప్పంద ఉద్యోగులకు వేతనాలు విడుదల చేస్తామంటూ కాంగ్రెస్ ప్రకటించిందని, కానీ అలా వేతనాలు మాత్రం పడలేదని చెబుతున్నారు. ఒకటో తారీఖు పోయి పన్నెండో తారీఖు వచ్చిందని, సంక్రాంతి పూట ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉన్నదని, ఈ సారి పండుగకు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీ నిలుపుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.