కలెక్టరేట్/ కొత్తపల్లి ఫిబ్రవరి 25: పర్యాటక రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని రాష్ట్ర పర్యాటక, గ్రామీణ అభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా తెలిపారు. తీగెల వంతెన పనుల్లో వేగం పెంచాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. కచ్చితమైన ప్రమాణాలు పాటిస్తూ గడువులోగా పూర్తి చేయాలని నిర్దేశించారు. శనివారం ఆయన పర్యాటక శాఖ ఎండీ మనోహర్తో కలిసి కరీంనగర్ జిల్లా కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు.
పర్యాటక శాఖ ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మానేరు రివర్ ఫ్రంట్ పనుల ప్రగతిని పరిశీలించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పాతింగ్ సుందరీకరణ పనులు, బోటింగ్ ఘాట్ల ఏర్పాట్లు, బతుకమ్మ ఘాట్, బోట్ క్రూజెస్, తదితర నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రాంతీయ క్రీడా పాఠశాలను సందర్శించారు. జిమ్నాస్టిక్, జిమ్, హాస్టల్, మెస్లను పరిశీలించారు. పిల్లలకు అందిస్తున్న భోజనం, వసతి ఇతర సదుపాయాలపై ఆరా తీశారు. స్పోర్ట్స్ స్కూల్ హెచ్ఎంతో మాట్లాడి ఖాళీ పోస్టుల వివరాలు తెలుసుకున్నారు.
అంతకుముందు రెండు వాటర్ ప్యూరీఫయర్లను ప్రారంభించారు. ఫ్రాన్స్ దేశం తరహాలో రెండు ఆధునికరించిన బోట్ క్రూజెస్ తెప్పించడానికి వెంటనే ఆర్డర్ జారీ చేయాలని పర్యాటక శాఖ ఎండీని ఆదేశించారు. అన్ని పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయినందున పనులన్నీ వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఉత్తర తెలంగాణ పర్యాటక రంగానికి తలమానికంగా నిలవనున్న తీగెల వంతెనపై చేపట్టే ప్రతి పనిని ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే ప్రారంభించాలన్నారు. అప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తి కాగానే ట్రయల్న్ చేపట్టాలన్నారు. ఎలక్ట్రీషియన్ పనులు కూడా జాగ్రత్తగా పూర్తి చేయాలన్నారు. అనంతరం మానేరు రివర్ఫ్రంట్, పోలీస్ శిక్షణ కళాశాల పక్కన నిర్మిస్తున్న హరిత హోటల్ పనులు పరిశీలించి అధికారులకు సూచనలు చేయాలన్నారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై దృష్టిపెట్టాలని సూచించారు. జిమ్నాస్టిక్స్ శిక్షణ, మెటీరియల్, పిల్లలకు బ్లాంకెట్లు, ఇతర వసతుల కల్పనకు నిధులు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బైపాస్ నుంచి స్కూల్ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులిస్తానని చెప్పారు. ప్రభుత్వం క్రీడారంగానికి ప్రాధాన్యమిస్తున్నదన్నారు. విరివిగా నిధులు కేటాయించి ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. బాక్సింగ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు నిఖత్ జరీన్, పీవీ సింధూ, సానియామీర్జా, సైనా నెహ్వాల్కు భారీగా నజరానాలు ప్రకటించిందని గుర్తు చేశారు. క్రీడాకారులు సర్కారు కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని క్రీడల్లో రాణించి తెలంగాణ కీర్తిని చాటాలని సూచించారు.ఆయన వెంట కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, టూరిజం శాఖ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, శిక్షణ కలెక్టర్ వాట్సల్ టొప్పో, జడ్పీ సీఈవో ప్రియాంక తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ డిప్యూటీ ఇంజినీర్ దీపక్, ఇంజినీర్ ఇన్ చీఫ్ శంకర్ ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ ఇంజినీర్లు సాంబశివరావు, శ్రీనివాసరావు, డీవైఎస్వో రాజవీర్, ఆర్డీవో ఆనంద్ కుమార్, స్పోర్ట్స్ సూల్ హెచ్ఎం లీలాప్రసాద్ పాల్గొన్నారు.