టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై ఆర్టీసీ ఉద్యోగులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. సోమవారం రాత్రి నుంచే సంబురాలు జరుపుకోగా, రెండో రోజు మంగళవారం సైతం కరీంనగర్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోలు, బస్టాండ్లలోనూ సంబురాలు చేసుకున్నారు. పటాకులు పేల్చి, స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్, సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మేలును ఎన్నటికీ మరువలేమని, జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణచౌక్/ హుజూరాబాద్/హుజూరాబాద్టౌన్, ఆగస్టు 1 : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని రాష్ట్ర సర్కారు ప్రకటించడంపై సంస్థలోని ఉద్యోగులు, కార్మికుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. సోమవారం రాత్రే సంబురాలు జరుపుకున్న వారు, మంగళవారం కూడా రెట్టింపు ఉత్సాహంతో వేడుకలు చేసుకున్నారు. కరీంనగర్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోలు, ప్రధాన బస్టేషన్ల వద్ద పటాకలు పేల్చి, స్వీట్లు పంచిపెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్, రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపారు.
కరీంనగర్లో మహిళా సిబ్బంది యూనియన్ నాయకులు, గ్యారేజీలోని మెకానికులు, సెక్యూరిటీ గార్డులో పండుగలా వేడుకలు నిర్వహించారు.
కరీంనగర్ డిపో-1,2 మేనేజర్లు ప్రణీత్, మల్లయ్య ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. డిపో-1లో జరిగిన సంబురాల్లో మేయర్ సునీల్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ‘సీఎం కేసీఆర్ వర్ధిల్లాలి, లాంగ్ లీవ్ సీఎం కేసీఆర్’ అంటూ నినదించారు. జోనల్ వర్క్షాప్ ఎదుట ఉద్యోగులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
హుజూరాబాద్లో ఉదయం ఆర్టీసీ డిపోలో సంబురాలు నిర్వహించగా, సాయంత్రం డిపో ఎదుట జరిగిన వేడుకల్లో మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, డిపో మేనేజర్ అర్పిత, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, ఆర్టీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డు మెంబర్లు సీహీచ్ రవీందర్, ఎన్ సురేఖ పాల్గొన్నారు.
జగిత్యాల డిపోలో మేనేజర్ వెంకట నర్సప్ప, కోరుట్ల డిపోలో మేనేజర్ లక్ష్మీ ప్రసూన, మెట్పల్లి బస్ డిపో ఎదుట మేనేజర్ వేదవతి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
సిరిసిల్ల డిపోలో మేనేజర్ మనోహర్ ఆధ్వర్యంలో సంస్థ ఉద్యోగులు సంబురాలు జరుపుకోగా, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి పాల్గొన్నారు. వేములవాడలో డీఎం మురళీ కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, జడ్పీటీసీ మ్యాకల రవి హాజరయ్యారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోలో జరిగిన సంబురాలకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరయ్యారు. మంథని డిపోలో జరిగిన వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ, ఎంపీపీ కొండ శంకర్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, డీఎం రాజశేఖరం పాల్గొన్నారు. పెద్దపల్లి బస్టాండ్ ఆవరణలో సీఎం కేసీఆర్ ప్లెక్సీకి ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. ఆర్టీసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు జీ కోటేశ్వర్లు పాల్గొన్నారు.
ఇచ్చిన హమీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నరు
ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హమీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవడం సంతోషంగా ఉంది. మా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టేందుకు తీసుకున్న నిర్ణయంతో కార్మికులకు ఎంతో మేలు కలుగుతుంది. కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– పద్మ శ్రీనివాస్, ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డ్ సభ్యుడు, మెట్పల్లి (మారుతీనగర్)
శ్రమకు దక్కిన ఫలితం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర కేబినేట్ తీసుకున్న నిర్ణయం హర్షణీయం. ఎన్నో ఏండ్లుగా కార్మికుల పడుతున్న శ్రమకు దక్కిన ఫలితం. 43 వేల మందికి పైగా ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండినయ్. ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించడం వల్ల వారిలో భరోసా కనబడుతుంది. ఇక నుంచి ఉద్యోగులకు పెన్షన్, ఇతర వసతులు అందుతయ్. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి ధన్యావాదాలు.
– మల్లయ్య, డిపో-2 మేనేజర్ (కరీంనగర్ తెలంగాణచౌక్)
ముఖ్యమంత్రిది గొప్ప మనసు
వేలాది మంది కార్మికులు ఉన్న సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం సాహసంతో కూడుకున్న నిర్ణయం. దేశంలోనే అతి పెద్ద రవాణా సంస్థ ఆర్టీసీ. ఎన్నో ఏండ్లుగా ప్రజలకు సేవలను అందిస్తూ వారి మన్ననల పొందుతున్నది. లాభ నష్టాలతో సంబంధం లేకుండా ప్రజల కోసం పని చేస్తున్న సంస్థ ఇది. కార్మికులకు సరిపడా జీతాలు లేకున్నా ఏన్నో ఏండ్లుగా విధులు నిర్వహిస్తున్నరు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతున్నరు. వేలాది మందికి న్యాయం జరిగేలా తీసుకున్న నిర్ణయం హర్షనీయం.
– ప్రణీత్ డిపో-1 మేనేజర్ (కరీంనగర్ తెలంగాణచౌక్)
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
నేను 2005 నుంచి ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్న. 2010లో పర్మినెంట్ అయిన. ఎన్నో ప్రభుత్వాలు మారినయి గానీ, మా సంస్థను ఏ ఒక్క నాయకుడూ పట్టించుకున్న పాపానపోలేదు. సీఎం కేసీఆర్ ఒక్కరే ఆదుకున్నరు. కష్టపడి చేసే ఉద్యోగుల కష్టాలను చూసి గొప్ప నిర్ణయం తీసుకున్నరు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించి మా బతుకుల్లో వెలుగులు నింపిండు. సార్కు రుణపడి ఉంటాం. రాబోయే కాలంలో కష్టపడి పని చేస్తాం.
– అనకట్ల గోపి, ఆర్టీసీ డ్రైవర్ (పెద్దపల్లి)
గొప్ప మనసున్న వ్యక్తి
కొన్నేళ్లుగా ఆర్టీసీలో కార్మికులు పడుతున్న ఇబ్బందులను పెద్ద మనసుతో గుర్తించి ఇతర ఉద్యోగుల వలె ప్రభుత్వంలో విలీనం చేసి అన్ని వసతులు కల్పించాలని చూడడం సీఎం కేసీఆర్ గొప్ప మనసుకు నిదర్శనం. ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడంతోపాటు ఈ నెల 3న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని చెప్పడం మా కార్మిక లోకానికి పెద్ద పండుగ. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మేము ముఖ్యమంత్రి పెట్టుకున్న ఆశయాల కనుగుణంగా మరింతగా పనిచేసి మంచి పేరు తీసుకువస్తాం. గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి ఆర్టీసీ కార్మికులం అండగా ఉంటాం.
-చిటికేశి రవీందర్, ఆర్టీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డు మెంబర్, డ్రైవర్ (హుజురాబాద్టౌన్)
చాలా ఆనందంగా ఉంది
తెలంగాణలో ఆర్టీసీ సంస్థను, కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్లో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో సైతం ఆర్టీసీ కార్మికులమంతా చురుగ్గా పాల్గొని మా వంతు పాత్ర పోషించాం. ఆ రోజు సంస్థను కాపాడుతానని సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారమే మా సంస్థను, మమ్మల్ని ప్రభుత్వంలోకి విలీనం చేశారు. మాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
– వీ ఇందిరా దేవి, కండక్టర్ (మంథని)
మరిచిపోలేని బహుమతి
సీఎం కేసీఆర్ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారని ఊహించలేదు. ఏన్నో ఏండ్లుగా పోరాటం చేసినా ఫలితం రాలేదు. కానీ, సీఎం కేసీఆర్ మా బాధలను తెలుసుకొని ఊహించని విధంగా మాకు బహుమతి ఇచ్చిన్రు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మన సీఎం కేసీఆర్ వల్ల మాత్రమే సాధ్యమైతది. ఇది ఎప్పటికీ మేం మరిచిపోలేని బహుమతి.
– విజయలక్ష్మి, కండక్టర్ (వేములవాడరూరల్)
దశాబ్ధాల కల నెరవేరింది
ఆర్టీసీ కార్మికుల దశాబ్ధాల కల సీఎం కేసీఆర్తో నెరవేరింది. ఆర్టీసీని రక్షించింది, ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇన్నేండ్ల మా గోసకు తెరపడింది. భరోసాగా బతికే ధైర్యాన్ని ముఖ్యమంత్రి మాలో నింపిన్రు. సీఎం కేసీఆర్ ప్రకటనతో మా కుటుంబాల్లో పండుగ వచ్చింది. మేం, మా ఇంట్లో వాళ్లందరం ఆయనకు జన్మజన్మలా రుణపడి ఉంటాం.
– లకావత్ పర్శరామ్, ఎస్డీఐ (సిరిసిల్ల కలెక్టరేట్)
మా జీవితాలకు భరోసా దొరికింది
నా భర్త, నేను ఇద్దరం ఆర్టీసీ ఉద్యోగులం. మా ఆయన రఘు గారేజీలో పెయింటింగ్ వర్క్స్ చేస్తడు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పిన కేసీఆర్, ఇచ్చిన మాట నెరవేర్చడమే కాదు ఇప్పుడు మా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసిన చరిత్ర సృష్టించారు. ఇది మేము అస్సలు ఊహించలేదు. నా సర్వీసు ఇంకో 15 ఏండ్లు ఉంది. మంచిగా ఉద్యోగం చేసి జీవితంలో స్థిరపడే అవకాశం కల్పించిన సార్కు మేం జీవితాంతం రుణపడి ఉంటం. మా ఆర్టీసీ ఉద్యోగుల కృతజ్ఞతలు సార్కు ఎప్పుడూ ఉంటాయి. మా దీవెనలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంటాయి.
– వాణీ కండక్టర్, జగిత్యాల డిపో (జగిత్యాల)
మా కుటుంబాలకు మంచి రోజులు
సీఎం కేసీఆర్ నిర్ణయంతో మా ఆర్టీసీ కుటుంబాలకు మంచిరోజులు వచ్చినట్టే. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో సీఎం సార్ తర్వాతే ఎవరైనా. ఆర్టీసీలో పని చేస్తున్న మహిళల పట్ల సీఎం కేసీఆర్ ఎంతో ఉదారత చూపారు. మాకు సంస్థలో ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి టీఎస్ ఆర్టీసీ సంస్థను సీఎం సార్ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు అడుగకముందే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కార్మికులకు తీపి కబురు అందించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో మా కుటుంబాలకు భవిష్యత్పై భరోసా కలిగింది. సీఎం కేసీఆర్ సార్కు ఆర్టీసీ ఉద్యోగ కుటుంబాలు వెన్నంటి ఉంటాయి.
– శోభరాణి, కండక్టర్ (కోరుట్ల )
కలలో కూడా అనుకోని గిఫ్ట్ ఇచ్చిండు
మేం కలలో కూడా అనుకోనివిధంగా సీఎం కేసీఆర్ ఆర్టీసీ సంస్థకు, కార్మికులకు ప్దె గిఫ్ట్ ఇచ్చిండు. ఎన్నో ఏళ్లుగా సంస్థ బలోపేతం కోసం కృషి చేస్తున్న మా అందరినీ, మా సంస్థను ప్రభుత్వంలోకి విలీనం చేస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకోడం హర్షణీయం. సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సీఎం కేసీఆర్కు మేం, మా కుటుంబ సభ్యులమంతా జీవితాంతం రుణపడి ఉంటాం.
-సదానందం, ఆర్టీసీ కండక్టర్ (మంథని)