విద్యానగర్, ఏప్రిల్ 1: వైద్యరంగంలో వస్తున్న మార్పులు, అధునాతన చికిత్స పద్ధతులపై అవగాహనకు సదస్సులు దోహదపడతాయని ఆర్ఎస్ఎస్డీఐ చైర్మన్ డాక్టర్ శంకర్ అన్నారు. శనివారం కరీంనగర్లోని వీ కన్వెన్షన్లో రెండు రోజులు జరిగే 8వ ది చాప్టర్ ఆఫ్ రీసెర్చ్ సోసైటీ ఫర్ స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా కాన్ఫరెన్స్ శనివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సదస్సులో షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన ఇన్సూలిన్, మాత్రల మోతాదులు, రీసెర్చ్ స్టడీస్తో పాటు ట్రీట్మెంట్పై జాతీయ, అంతర్జాతీయ వైద్యులు వివరిస్తారన్నారు. ఇందులో పీజీ విద్యార్థులకు క్విజ్తో పాటు ప్రజంటేషన్, ఓరియం టేషన్ కార్యక్రమం ఉంటుందన్నారు.
ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం కాన్ఫరెన్స్లను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి వైద్యుడు సంవత్సరానికి ఐదు సదస్సులకు హాజరుకావాలని కోరారు. పాల్గొన్న ప్రతి డాక్టర్కు సర్టిఫికెట్ అందజేస్తామని చెప్పారు. ప్రపంచంలో అత్యధికంగా డయాబెటిస్ పేషెంట్లు ఉన్న దేశంగా భారతదేశం నిలువడం దురదృష్టకరమన్నారు. 2050 నాటికి ప్రతి ఇంటిలో ఒక షుగర్ వ్యాధిగ్రస్తుడు ఉండే అవకాశమున్నదని తెలిపారు. రోగులు వైద్యుల సలహాలు, సూచనల మేరకే మందులు వాడాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులతో పాటు లివర్, కిడ్నీ, తదితర సమస్యలతో ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుందన్నారు. ప్రస్తుతం 20 నుంచి 30 సంవత్సరాల్లోపు యువకులు ఈ వ్యాధి బారినపడుతున్నారని చెప్పారు.
ఆహార నియామవళి పాటించకపోవడం, మానసిక ఒత్తిడితోనే ఈ రుగ్మత బారిన పడుతున్నారని విశ్లేషించారు. ఈ వ్యాధి కారణంగా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని చెప్పారు. మొదటిసారి కరీంనగర్లో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు 700 మందికి పైగా వైద్యులు పాల్గొనడం శుభసూచకమన్నారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ డాక్టర్ లిల్లి రోడరిగెస్ నిర్వాహకులు సన్మానించారు. డాక్టర్ వసంత్కుమార్, రాకేశ్ సహయ్, తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ డీసీ తిరుపతిరావు, కో చైర్మన్ డాక్టర్ రఘురామన్, సెక్రటరీ డాక్టర్ విజయమోహన్రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ చైతన్యరెడ్డి, డాక్టర్ శేష శైలజ, డాక్టర్ సురేష్, డాక్టర్ లక్ష్మణ్ వడ్డెబోయిన, వెంకట్రెడ్డి, వెంకటేశ్వర్లు, నవీనా, పద్మ, అనిష్రెడ్డి, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రాథమిక దశలోనే మెరుగైన చికిత్స తీసుకోవాలి. రోగులు ప్రతి మూడునెలలకోసారి టెస్ట్లు చేయించుకొని వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలి. సొంత చికిత్స ఎప్పటికీ ప్రమాదమే. ఆరోగ్యకర మైన జీవన శైలి, పిండిపదార్థాలు తక్కువ ఉండి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని భుజించాలి. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సమృద్ధిగా తీసుకోవాలి. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఎక్కడైనా గంటకు మించి ఎక్కువ సేపు కూర్చోవద్దు, ప్రతిరోజు 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. పొగ తాగడం, ఆల్కహాల్ను పూర్తిగా మానేయాలి.
– డీసీ తిరుపతిరావు, సీనియర్ ఫిజిషియన్
షుగర్ వ్యాధి ప్రాణాంతకం కాదు. ఈ రుగ్మత బారిన పడ్డవారికి కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. వీరికి సరైన ఆహారం, సమయానికి మందులు ఇవ్వాలి. డయాబెటిస్ను కంట్రోల్ ఉంచేందుకు అత్యాధునిక చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. సరైన వైద్యం తీసుకుంటే సాధారణ జీవితం గడుపవచ్చు.
– రఘురామన్, సీనియర్ ఫీజిషియన్
మధుమేహం ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఒత్తిడికి గురికావద్దు. ప్రశాంతంగా ఉన్నప్పుడే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. సరైన సమయంలో ఆహారం తీసుకోవడంతో పాటు రోజుకు 30 నిమిషాల పాటు వాకింగ్ తప్పనిసరి. 6 నుంచి 8 గంటల పాటు నిద్ర పోవాలి. చక్కెర తక్కువ కలిగిన, ప్రోటిన్లు అధికంగా ఉండే మితహారం తీసుకోవాలి.
– విజయమోహన్రెడ్డి, సీనియర్ ఫిజిషియన్
మధుమేహం కలిగిన వ్యక్తులు భయపడాల్సిన అవసరం లేదు. మూడు నెలలకోసారి కళ్లు, గుండె, లివర్, కిడ్ని లాంటి పరీక్షలు చేయించుకుంటూ మందులు వాడాలి. వైద్యుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. గతంతో పోల్చితే ఇప్పుడు అధునాత చికిత్స పద్ధతులు అందుబాటులోకి రావడం శుభపరిణామం.
– డాక్టర్ లిల్లి, ఆర్ఎస్ఎస్ డీఐ చైర్మన్ ఎలెక్ట్