మెట్పల్లి, డిసెంబర్ 22: మెట్పల్లి పట్టణంలో దొంగలు హల్చల్ సృష్టించారు. ఒకే రోజు రాత్రి పట్టణంలోని పాత బస్టాండ్, వెల్లుల్ల రోడ్డు, ఏడీబీ బ్యాంకు ప్రాంతాల్లోని 14 దుకాణాల్లో చొరబడ్డారు. దుకాణాల కౌంటర్లను ధ్వంసం చేసి నగదు, వివిధ వస్తువులను ఎత్తుకెళ్లారు. గురువారం తెల్లవారు జామున జరిగిన ఈ చోరీ ఘటన పట్టణంలో కలకలం రేపుతోం ది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని 63వ జాతీయ రహదారిలో పాత బస్టాండ్ సమీపంలోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం, వెంకటేశ్వర ట్రేడర్స్, అనిల్ ఐరన్ హర్డ్వేర్, కనక సోమేశ్వర కిరాణం, పద్మాలయ ఎలక్ట్రానిక్, కావ్యశ్రీ మెడికల్, వాసవి మొబైల్ పాయింట్, మెయిన్ బాక్స్ డ్రెస్సెస్, నాగేంద్ర మెడికల్, వరలక్ష్మి ఫర్టిలైజర్ సహా వెల్లుల్ల రోడ్డులోని రెండు, ఎస్బీహెచ్ ఏడీబీ రోడ్డులోని మరో మెడికల్ దుకాణాల తాళాలు పగుల గొట్టి చొరబడ్డారు.
పలు దుకాణాల్లో కౌంటర్లను ధ్వంసం చేసి అందులోని డబ్బును ఎత్తుకెళ్లారు. కాగా తలుపు చెక్కల దుకాణాలనే దొంగలు లక్ష్యంగా చేసుకుని దొం గతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే గురువారం ఉదయం అటువైపు వెళ్లిన స్థానికులకు దుకాణాల తలుపులకు పగులగొట్టిన తాళాలు కన్పించడంతో సంబంధిత దుకాణాల యజమానులు, పోలీసులకు సమాచారం అందించారు. అగ్రోస్ రైతు సేవ కేంద్రంతో పాటు వివిధ దుకాణాల్లో కలిపి సుమారు రూ. 5 లక్షలు నగదుకు పైగా అపహరణకు గురైనట్లుగా చెబుతున్నారు. తెల్లవారు జామున 2 నుంచి 3 గంటల మధ్య దొంగల ముఠా జట్లుగా విడిపోయి మూడు ప్రాంతాల్లోని దుకాణాల్లో చోరీకి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు.
స్థానిక సీఐ లక్ష్మీనారాయణ, పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగల ఆనవాళ్లను గుర్తించేందుకు క్లూస్టీం సభ్యులను రంగంలోకి దించారు. వివిధ దుకాణాలు, ప్రధాన కూడళ్లలోని సీసీ కెమెరాల్లోని ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మన్మథరావు తెలిపారు.