హుజూరాబాద్ టౌన్, ఏప్రిల్ 18 : రేషన్ బియ్యం అక్రమ దందా జోరుగా సాగుతున్నది. ఎన్ని రకాలుగా పక్కదారి పట్టాలో అన్ని రకాలు బ్లాక్ మార్కెట్కు తరలుతున్నది. తక్కువ ధరకు కొని, ఇతర రాష్ర్టాలకు తరలించి సొమ్ముచేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నట్లు తెలుస్తున్నది. ఇలానే ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు పది రోజుల క్రితం జైశ్రీరాం బ్యాగుల్లో పీడీఎస్ రైస్ను ప్యాక్ చేసి గుజరాత్కు తరలిస్తుండగా, హుజూరాబాద్లో పట్టుకోవడం సంచలనం సృష్టించింది. శాంపిల్ను ల్యాబ్కు పంపించి టెస్ట్ చేయగా, అవి రేషన్ బియ్యమే అని తేలడంతో దందా గుట్టు రట్టయింది.
సివిల్ సప్లయ్ హుజూరాబాద్ డీటీ వసంతరావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ వినోద్కుమార్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. పరకాలకు చెందిన శ్రీ రాజరాజేశ్వర ప్యాడి అండ్ జనరల్ రైస్మిల్లులో రామిడి శ్రావణ్కుమార్ అనే వ్యాపారి ఎవరికీ అనుమానం రాకుండా పీడీఎస్ బియ్యాన్ని జై శ్రీరామ్ పేరుతో ఉన్న కవర్లలో (సంచుల్లో) నింపారు. హుజూరాబాద్ మీదుగా గుజరాత్కు లారీ (జీటీ 36 యూవీ 4535)లో అక్రమంగా తరలిస్తుండగా, ఈ నెల 10న అర్ధరాత్రి పోలీసులు అనుమానించి పట్టుకున్నారు.
ఈ నెల 11న సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించగా, లారీలోని బియ్యాన్ని శాంపిల్గా తీసి హైదరాబాద్ ల్యాబ్కు పంపించారు. అవి ఆరు నెలల క్రితపు పీడీఎస్ బియ్యంగా గుర్తించి సివిల్ సప్లయ్ అధికారులకు సర్టిఫికెట్ ఇవ్వడంతో వారు రైస్ మిల్ యజమాని శ్రవణ్కుమార్, లారీ డ్రైవర్, క్లీనర్పై 6ఏ కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేశారు. సీజ్ చేసిన 350 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంను హుజూరాబాద్ పట్టణంలోని సివిల్ సప్లయ్ గోదాంకు తరలించి భద్రపరిచారు.