అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి
ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చాలి
ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్
జగిత్యాల, రాయికల్ మున్సిపల్ పాలకవర్గాలతో హైదరాబాద్లో సమీక్ష
పాల్గొన్న ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే సంజయ్, కలెక్టర్ రవి
రాయికల్ రూరల్/ జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 8: రాష్ట్ర సర్కారు చేపట్టిన పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలు అభివృద్ధిలో పరుగులు తీస్తున్నాయని, అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీలు పాలకవర్గం బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రెండేళ్లలో జరిగిన అభివృద్ధి పనులపై తయారు చేసిన ప్రగతి నివేదికను ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి మంత్రి కేటీఆర్ మంగళవారం హైదరాబాద్లోని మంత్రి కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం సమీక్షించారు. రాయికల్ మున్సిపాలిటీ నూతన భవనం, రూ.7కోట్ల తో నిర్మించి నిరుపయోగంగా ఉన్న ఫిల్టర్ బెడ్ను వినియోగంలోకి తీసుకురావాలని రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన కేటీఆర్, మున్సిపల్ భవనానికి రూ.2 కోట్లు మంజూరు చేయడమే కాకుండా స్వయంగా వచ్చి భూమి పూజ చేస్తానని హామీ ఇచ్చారు. ఫిల్టర్ బెడ్ను త్వరగా వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మిషన్ భగీరథ పనులతో ధ్వంసమైన రహదారి, సీసీ మరమ్మతులకు అదనపు నిధులు మంజూరు చేయాలని, 10కిలో మీటర్లు అదనంగా మిషన్ భగీరథ పైప్లైన్ పనులకు నిధులు మంజూరు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. టీయూఎఫ్ఐడీసీ నిధులు జగిత్యాల పట్టణానికి రూ.18కోట్లు, రాయికల్కు రూ.12కోట్ల మిగులు నిధుల పనులకు అనుమతినిచ్చారు. జగిత్యాల, రాయికల్ పురపాలక కార్యాలయాల నూతన భవన నిర్మాణాలకు అనుమతులు సైతం మంజూరు చేశారు. నూకపెల్లిలో నిర్మిస్తున్న 4520డబుల్ బెడ్ రూం ఇండ్లకు రోడ్డు, లైట్లు, వాటర్ సప్లయ్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు ఇవ్వాలని కోరగా మంత్రి సుముఖత వ్యక్తం చేశారు. బీట్ బజార్లోని ఏడెకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. జగిత్యాల పట్టణ మాస్టర్ ప్లాన్ను వచ్చే మార్చి చివరిలోగా పూర్తిగా రివిజన్ చేయాలని, అధికారులను ఆదేశించారు. జగిత్యాల, రాయికల్ పట్టణాల్లో మొక్క ల పెంపకం, పట్టణ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఇక్కడ ఎమ్మెల్యే సంజ య్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ తోపాటు సీడీఎంఏ సత్యనారాయణ, కలెక్టర్ జీ రవి, మున్సిపల్ అధ్యక్షులు బోగ శ్రావణి, మోర హన్మాండ్లు, ఈఎన్సీ శ్రీధర్, డీటీసీపీ విద్యాధర్, వైస్ చైర్మన్లు గోలి శ్రీనివాస్, గండ్ర రమాదేవి, మున్సిపల్ కమిషనర్లు స్వరూప రాణి, శ్రీనివాస్ గౌడ్, ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు ఉన్నారు.