పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో మరోసారి కోడ్ అమలులోకి వచ్చింది. ఈ నెల 16 నుంచే ఎన్నికల నియామవళి అమలవుత్నుది. ఈ సమయంలో సామాన్యులు అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తమ అవసరాల కోసమైనా రూ.50వేలకు మించి నగదు, బంగారం తరలిస్తే తగిన ఆధారాలు చూపాల్సి వస్తుంది. లేకుంటే సీజ్ చేసే ప్రమాదమున్నది. అందుకే ఎన్నికల కోడ్ ఏం చెబుతోంది? సామాన్యులు, పార్టీల అభ్యర్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలపై జోరుగా చర్చ జరుగుతున్నది.
కరీంనగర్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల షెడ్యుల్ విడుదలైన మరుక్షణం (ఈ నెల 16) నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇది ఎన్నికల ప్రక్రియ ముగిసే నాటికి అంటే.. జూన్ 6వ తేదీ దాకా కొనసాగనున్నది. ఎన్నికల్లో ప్రలోభాలను అడ్డుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా చర్యలు తీసుకుంటుండగా, ఉమ్మడి జిల్లా పరిధిలో నిఘా పెంచారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును సీజ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సామాన్య ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమున్నది. బ్యాంక్ నుంచి నగదును డ్రా చేస్తే సంబంధిత స్టేట్మెంట్, ఏటీఎం ద్వారా డ్రా చేస్తే దానికి సంబంధించిన రసీదు తప్పనిసరిగా తనిఖీ దగ్గర ఉంచుకోవాలి. 50వేలకు మించి నగదు, అంత విలువైన బంగారం ఆధారాలు లేకుండా తరలించరాదు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే తప్పనిసరిగా ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. లేదంటే ఈ నగదును, బంగారాన్ని సీజ్ చేసి కోర్టుకు స్వాధీన పరుస్తా రు. ఎక్కువ మొత్తంలో నగదు, బంగారం పట్టుబడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. అంతే కాకుండా, ఐటీ శాఖకు అప్పగించి లెక్కలు చెప్పాల్సి వస్తుంది. గిఫ్ట్లు తరలించినా అవి అక్రమమని భావిస్తే తప్పనిసరిగా సీజ్ చేసే అధికారం ఎన్నికల అధికారులకు ఉంటుంది. కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత సీజ్ చేసిన మొత్తాన్ని సమీపంలోని ట్రెజరీలో జమ చేస్తారు. ఈ విషయాన్ని 24 గంటల్లో కోర్టుకు తెలియజేస్తారు.
పార్టీలు.. అభ్యర్థులకు సంకటమే..
ప్రస్తుత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల నియమావళి (ఎలక్షన్ కోడ్)పైనే చర్చ జరుగుతున్నది. కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కొందరు ఎన్నికల కమిషన్ సిబ్బందిగా విధులు నిర్వర్తిస్తారు. కోడ్ వేళ ఏ రాజకీయ పార్టీకి ప్రయోజనాలు చేకూర్చేలా ప్రజాధనాన్ని ఉపయోగించరాదు. కొత్త ప్రభుత్వ పథకాలు, భూమి పూజలు, శంకుస్థాపనలు, ప్రకటనలు చేయరాదు. ప్రభుత్వ వాహనాలు, భవనాలు, స్థలాలను ఎన్నికల ప్రచారం కోసం వినియోగించరాదు. ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించినా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కులం, మతం ప్రాతిపదికన ఏ రాజకీయ పార్టీ కూడా ఓట్లను అభ్యర్థించరాదు. మత ఘర్షణలు, కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయ ప్రసంగాలు, ప్రకటనలు చేయరాదు. అభ్యర్థులు వ్యక్తిగత ధూషణలు, ప్రజా జీవితంతో సంబంధం లేని అంశాల జోలికి వెళ్లరాదు. మసీదులు, చర్చిలు, దేవాలయాల్లో ఎన్నికల ప్రచారం చేయరాదు. ఓటర్లకు డబ్బు, బహుమతులు ఇచ్చి ప్రలోభ పెట్టరాదు. ఓటర్లకు లంచాలు ఇవ్వడం, బెదిరించడం, అవమానించడం లాంటివి చేయరాదు.
ఉల్లంఘిస్తే శిక్షలు
ఎన్నికల నియమావళిని అమలు చేసేందుకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులను ఎన్నికల కమిషన్ రంగంలోకి దింపుతుంది. ఏదైనా రాజకీయ పార్టీ, లేదా అభ్యర్థి ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. నేరాలు తీవ్రమైతే అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే అధికారం ఉంటుంది. నియమావళిని ఉల్లంఘిస్తే జైలు శిక్షలు విధించే చట్టాలు కూడా ఉన్నాయి.
ధర్మారంలో 2.80 లక్షలు సీజ్
ధర్మారం మండల కేంద్రంలోని జక్కన్నపల్లి చెక్పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల నుంచి 2.80లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ టీ సత్యనారాయణ తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జక్కన్నపల్లి వద్ద కరీంనగర్-రాయపట్నం రహదారిపై రెండో ఎస్ఐ అశ్విని కలిసి పలువురు పీసీలు వాహనాల తనిఖీ చేపట్టారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం టీఎస్కే తండాకు చెందిన ధరావత్ ఠాగూర్, లోకవత్ దేవేందర్కు చెందిన బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా వారి వద్ద 55 వేల నగదును గుర్తించినట్లు చెప్పారు. మరో బొలేరో వాహనంలో ప్రయాణిస్తున్న చొప్పదండి మండలానికి చెందిన సీహెచ్ అంజయ్య, బీ కుమార్, సీహెచ్ మల్లయ్య, ఆర్ అంజయ్య, బీ లచ్చయ్య వద్ద తనిఖీలు చేయగా వారి వద్ద 2.25లక్షల నగదును గుర్తించామని, ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకొని ఫ్లయింగ్ స్కాడ్ టీంకు అప్పగించినట్లు తెలిపారు.