
Chigurumamidi | చిగురుమామిడి, జూలై 24 : భూభారతి రీ సర్వే తో రైతు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని కరీంనగర్ ఆర్డీవో షర్మిల అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో భూభారతి సర్వే అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాలా గ్రామాల్లో రైతు సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో భాగంగా మండలంలో ఉల్లంపల్లి గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేసుకొని భూభారతి రీ సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినట్లు తెలిపారు. ఉ ల్లంపల్లి గ్రామంలో మొత్తం 294 సర్వే నెంబర్లు ఉన్నాయని, ఇందులో ప్రభుత్వ భూమి 234.18 ఎకరాలు ఉందన్నారు.
ప్రతీ సర్వే నెంబరు, ప్రతీ విస్తీర్ణం రీసర్వే చేయనున్నట్లు పేర్కొన్నారు. రీ సర్వేకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. గ్రామ సదస్సులో పలువురు రైతులు అడిగిన సమస్యలకు అధికారులు వివరణ ఇచ్చారు. భూ సమస్యలపై కొంతమంది రైతులు ఆర్జీలు సమర్పించగా అధికారులు స్వీకరించారు. తగిన న్యాయం చేసి పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అలువాల శంకర్, ఎస్ఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ఏడీ కిషన్ రావు, డీఐ శ్రీనివాస్, తహసీల్దార్ కొండం కనకయ్య, ఎంపీడీవో రామ్మోహన్ చారి, ఎంపీవో బత్తిని కిరణ్ కుమార్, మండల సర్వేయర్ బాలమురళీకృష్ణ, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.