Singareni | రామగిరి, జనవరి 26 : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి సంస్థ రామగుండం అర్జీ-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల ఆధ్వర్యంలో జీఎం కార్యాలయ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్నిఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ, స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం అందిస్తూ రూపొందించిన భారత రాజ్యాంగానికి 77 సంవత్సరాలు గడిచాయని, అందరము బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. తదుపరి సెంటినరీకాలనీ రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ప్రధాన వేడుకల్లో రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
తదుపరి నిర్వహించిన కవాతు ప్రదర్శనలో భాగంగా ఏరియా సెక్యూరిటీ సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉందని, వందేమాతరం గీతాన్ని ఆలపించి నేటికీ 150 సంవత్సరాలు అయిందని చెప్పారు. ప్రజలే పాలకులుగా రూపు దిద్దుకున్న మన భారత దేశానికి ఒక దశ, దిశ కల్పించడం కోసం రాజ్యాంగ రూపకల్పన చేశారన్నారు. భారత రాజ్యాంగ ప్రతిని రూపొందించిన కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించి, రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారిని మనం మరిచిపోలేమన్నారు. వారు దేశంలోని భిన్న నాగరికతలు, భిన్న మతాలు, కులాలు, ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తూ రాజ్యాంగ రూపకల్పన చేశారన్నారు. ప్రతీ ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని గ్రహించి, హక్కుల కోసమే కాకుండా, బాధ్యతలను కూడా తెలుసుకొని జీవించాలన్నారు. సింగరేణి సంస్థ యాజమాన్యం ఉద్యోగుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.
ప్రతీ ఉద్యోగి భద్రత తో వారి స్థాయిలో బాధ్యతతో కూడిన విధులు నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా పని చేస్తేనే సంస్థ మనుగడ సాధ్యమవుతుందని అన్నారు. ఉద్యోగుల కుటుంబ సభ్యుల కోసమే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజల కోసం ఎన్నో సామాజిక, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా, సంస్థ సామాజిక బాధ్యత క్రింద కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఉత్తమ ఉద్యోగులను సన్మానించారు. ఈ వేడుకల్లో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. గత సంవత్సరం విజిలెన్స్ అవగాహన వారోత్సోవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కోల్ ఇండియా స్థాయిలో వివిధ విభాగాల్లో గెలుపొందిన వారిని సన్మానించారు. సెక్యూరిటీ సిబ్బందికి నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు.