హుజూరాబాద్, డిసెంబర్ 24: మున్సిపాలిటీల్లో ఇండ్ల లెక్క పక్కగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన భువన్యాప్లో బల్దియా పరిధిలోని ఇండ్లు, వ్యాపారవాణిజ్య సముదాయాలకు సంబంధించిన వివరాల నమోదు ప్రక్రియ వేగంగా సాగుతున్నది. భవనాల కొలతలు, చిత్రాలతో పాటు పూర్తి వివరాలను ఆన్లైన్లో పొందుపరచనుండడంతో వీటి ఆధారంగా అక్రమ నిర్మాణాలను గుర్తించడం ద్వారా మున్సిపాలిటీకి అదనపు ఆదాయం సమకూరనున్నది.
మున్సిపాలిటీల్లో పారదర్శక పాలన అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భువన్యాప్ను రూపొందించింది. పట్టణాల్లోని కట్టడాల పూర్తి సమాచారాన్ని సేకరించి స్లాబుల ప్రకారం పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నది. ఇందులో భాగంగా సిబ్బంది ప్రతి భవనాన్ని అన్ని డిగ్రీల కోణంలో ఫొటోలు తీసి యాప్లో అప్ లోడ్ చేస్తారు. సదరు భవనం విస్తీర్ణం ఆధారంగా పన్ను విధిస్తారు. ఆయా భవనాలపై ప్రచార బోర్డులు, సెల్టవర్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలా.. వద్దా..? వంటి నిర్ణయాలు బల్దియా అధికారులు తీసుకుంటారు.
ఆదాయం పెరిగే అవకాశం
పట్టణాల్లో ఆస్తిపన్ను మదింపు సక్రమంగా జరుగక పోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో తీసుకువచ్చిన భువన్యాప్తో ఆస్తి పన్ను పరిధిలోకి రాని అక్రమ నిర్మాణాలను గుర్తించి, పన్ను విధిస్తే ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. కాగా, ఆయా పట్టణ పరిధిలోని భవనాల వివరాల నమోదుకు మున్సిపల్ సిబ్బంది కసరత్తు చేస్తున్నారు.
సమగ్ర సమాచారం నమోదు
ప్రతి ఇంటికి సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించాలన్న మున్సిపాలిటీ అధికారుల ఆదేశాలతో సిబ్బంది రంగంలోకి దిగారు. ఒక్కో భవనాన్ని అన్ని డిగ్రీల కోణంలో ఫొటోలు తీస్తున్నారు. వైశాల్యం, నల్లా కనెక్షన్లు, విద్యుత్ మీటర్లు, భవనాలపై ప్రచార బోర్డులు, సెల్టవర్ ఉంటే వాటి వివరాలను సైతం సేకరిస్తున్నారు.
వేగంగా నమోదు ప్రక్రియ
ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు భవనాల వివరాల నమోదు ప్రక్రియను వేగవంతం చేశారు. మున్సిపాలిటీ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఈ యాప్తో మున్సిపాలిటీలకు అదనపు ఆదాయం చేకూరుతుంది. మున్సిపాలిటీ పరిధిలో 9,351 ఇండ్లు ఉండగా, ఇప్పటి వరకు సగానిపైగా కొలతలు వేశారు.
-గందె రాధిక, హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్