కమాన్చౌరస్తా, జూలై 31: ఆ పాప వయస్సు రెండేళ్లే. కానీ, ఒకసారి చూసిన జంతువులు, వస్తువుల పేర్లు చెబుతూ, పెయింటింగ్స్ వేస్తూ ఆకట్టుకుంటున్నది. తాజాగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించింది జిల్లా కేంద్రానికి చెందిన చొట్టుమల్ల అర్హయ ఉదయ చైతన్య. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన చిట్టుమల్ల అడ్యుత్ చైతన్య, కన్నబోయిన ప్రశాంతి ఇద్దరు అమెరికాకు చెందిన సంస్థలో సాఫ్ట్వేర్ జాబ్ వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. వీరి కూతురు అర్హయ ఉదయ చైతన్యకు ఈ ఆగస్టు 6వ తేదీ వస్తే రెండేళ్లు నిండుతాయి. కానీ, తన చిట్టి బుర్రలో ఎన్నో గుర్తు పెట్టుకుంది.
ఒకసారి చూసిన వస్తువు పేరు ఎప్పుడు అడిగిన చెబుతూ ఆకట్టుకుంటుంది. చిన్నారి ప్రతిభను చూసిన తల్లిదండ్రులు, బాహ్య ప్రపంచానికి చూపాలనుకున్నారు. ఈ క్రమంలో అనేక రకాల జంతువులు, కార్లు, వస్తువులు, బొమ్మల కార్డులను చూపుతూ వివరించారు. దీంతో చూసినవి చూసినట్లు చెప్పడంతో పాటు, కుదురుగా కూర్చుండి పెయింటింగ్ సైతం వేస్తూ అబ్బురపరుస్తుంది. రెండు నిమిషాల్లోనే 60 బొమ్మల పేర్లు తడబడకుండా చెప్పేస్తుంది. అలాగే పోర్ ఆర్ట్, స్టాంప్ ఆర్ట్, స్పిన్ ఆర్ట్, అబస్ట్రక్ట్ ఆర్ట్స్ వేస్తుంది. అంతే కాదు, 20 నెలల వయస్సులోనే ఇప్పటి వరకు 111 ఆర్ట్ ఫామ్స్ పూర్తి చేసి ఔరా అనిపించింది. వీటితో పాటు 30 సెకండ్లలోనే తెలుగు, ఇంగ్లిష్ రైమ్స్ చెప్పేస్తుంది.
ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
అర్హయ ఉదయ చైతన్య ప్రతిభకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. రెండు రోజుల క్రితం చిన్నారికి సూపర్ టాలెంటెడ్ కిడ్ అవార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు యంగెస్ట్ ఆర్ట్ ప్రొడిగీ అవార్డును అందించారు. గతంలో బహుముఖ జ్ఞాపకశక్తి, గుర్తింపు, వల్లించడంలోనే అతి చిన్నారిగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. అలాగే, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు ఆధ్వర్యంలో ప్రశంస పత్రాలు అందుకున్నది.