యాసంగి వరి కోతల వెంటనే ధాన్యం కొనుగోళ్లకు ఉమ్మడి జిల్లాలో సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా మంగళవారం నుంచే కొనుగోళ్లు చేపట్టాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా, ఆయా జిల్లాల యంత్రాంగం రంగంలోకి దిగింది. ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసి, క్షేత్రస్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్న కలెకర్ల్ల ఆదేశాల మేరకు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నది. ఈసారి సాధారణానికి మించి సాగు విస్తీర్ణం పెరగడంతో 20.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసింది. జిల్లాలో జరిగే కోతలకు అనుగుణంగా ఒకటి రెండురోజుల్లో అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నది.
కరీంనగర్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వరాష్ట్రంలో తరలి వచ్చిన కాళేశ్వరం జలాలు, నిండిన ప్రాజెక్టులు, చెరువులు, జీవనదిలా వరదకాలువ, తద్వారా పెరిగిన భూగర్భజలాలతో ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అదనులో పంట పెట్టుబడి సా యం, పుష్కలంగా నీరు, కావాల్సినంత కరెంటు ఉండడంతో కరువు నేలపై వరి సిరులు కురిసింది. నిజానికి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల యాసంగి సాగు విస్తీర్ణం 7,39, 659 ఎకరాలు కాగా, ఈ యాసంగిలో 9,53, 630 ఎకరాల్లో సాగైంది. అంటే సాధారణంతో పోలిస్తే 2,13,971 ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. అలాగే గతేడాది యాసంగిలో 5,52, 977 ఎకరాల్లో సాగు కాగా, ఈసారి 4,00,653 ఎకరాల్లో అదనంగా పెరిగింది. అంటే గత యాసంగితో పోలిస్తే సుమారు 45 శాతం వరకు సాగు విస్తీర్ణం పెరిగింది.
సాగు విస్తీర్ణంలో ఎంతో తేడా
తెలంగాణ వస్తే ఏమొస్తది? అన్న ప్రశ్నలకు ఈ యాసంగి పంటనే గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు. నాడు సమైక్య రాష్ట్రంలో యాసంగిలో సాగు అంతంతే ఉండేది. సాధారణ సాగు విస్తీర్ణంలో ఆనాడు 25 శాతం కూడా సాగయ్యేది కాదు. వేసిన పొలాలు ఎండిపోయేవి. భూగర్భజలాలు లేక ఇబ్బందులు పడేది. అష్టకష్టాలు పడి చివరి వరకు ఎంతో కొంత పండించే ప్రయత్నం చేస్తే.. పొట్ట దశలో కరెంటు లేక పొలాలు ఎండిపోయేవి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాడు యాసంగి పంటలు పూర్తి స్థాయిలో రైతుల చేతికి వచ్చింది చాలా తక్కువ. 2011 నుంచి 2014 వరకు యాంసంగి సాగు విస్తీర్ణం సరాసరి చూస్తే.. సాగు 1.57 లక్షల ఎకరాలు మాత్రమే ఉన్నది. అదే ప్రస్తుతం 9.53 లక్షలకుపైగా పెరిగింది. అంటే ఎంతా తేడా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, మెట్ట ప్రాంతం, కరువుకు నిలయమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈసారి వరి సాధారణానికి మించి సాగైంది. నిజానికి సమైక్య రాష్ట్రం లో ఈ ప్రాంతంలో యాసంగి సాగు ఎకరాలను వేళ్లపై లెక్కపెట్టే పరిస్థితిలో ఉండేది. కానీ, స్వరాష్ట్రంలో సాగు పండుగలా మారి, ఎటుచూసినా పచ్చదనం కనిపిస్తున్నది.
పకడ్బందీ ఏర్పాట్లు
ఈ సీజన్లో అంచనాలకు మించి సాగు పెరగడం, దిగుబడి భారీగా వచ్చే అవకాశాలుండడం తో నాలుగు జిల్లాల్లోనూ కొనుగోళ్లకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అకాల వర్షాలు వచ్చే ముప్పున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యానికి ఏమీ కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఆయా గ్రామాల రైతులు ఒకేసారి కేంద్రాలకు వస్తే ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే.. ఏగ్రామాల రైతులు ఎప్పుడు కేంద్రాలకు రావాలో సమాచారం ఇస్తున్నారు. అంతేకాదు, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించేందుకు కావాల్సిన ట్రాన్స్పోర్ట్ సౌకర్యాన్ని సమకూర్చుకుంటున్నారు. వీటితోపాటు ఎక్కడా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు.. ఒక్కో కొనుగోలు కేంద్రానికి ఒక్కో అధికారి పర్యవేక్షణలో ఉండేవిధంగా ప్రణాళిక చేశారు.