వేములవాడ, జూలై 2 ;విద్యార్థుల్లో భాషా నైపుణ్యాల పెంపునకు సర్కారు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ స్కూళ్లల్లో పఠనోత్సవాలను నిర్వహిస్తున్నది. తెలుగు, ఆంగ్లం, హిందీ సబ్జెక్టులపై విద్యార్థులు పట్టు సాధించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు ప్రతిరోజూ ప్రార్థనా సమయంలో ఒక్కో విద్యార్థితో కథలు, పద్యాలు చెప్పిస్తూ అందరితో పఠింపజేస్తున్నారు. జూన్ 26న ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని ఈ నెల 31వరకు నిర్విఘ్నంగా కొనసాగించనున్నారు.
సర్కారు బడుల్లో అభ్యసిస్తున్న విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు సర్కారు మరో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్ లాంగ్వేజీలపై పట్టు సాధించేందుకు అన్ని స్కూళ్లల్లో గత జూన్ 26 నుంచి ఈ నెల 31 వరకు పఠనోత్సవాలు నిర్వహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో తెలుగు, ఇంగ్లిష్లో నైపుణ్యాల పెంపునకు చర్యలు చేపడుతున్నారు. వేములవాడ జడ్పీ స్కూల్ ఉపాధ్యాయులు ఓ అడుగు ముందుకువేసి హిందీ భాషలోనూ నైపుణ్యాల పెంపునకు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజూ ప్రార్థన సమయంలో 10 నిమిషాల పాటు నిర్వహిస్తున్నారు.
అవకాశాలను అందిపుచ్చుకొనేందుకే..
ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరిగా మారింది. సంభాషణ చాతుర్యం, వాగ్దాటి కలిగిన వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాల దశ నుంచే విద్యార్థుల్లో భాషలపై బిడియం పొగొట్టి పట్టు సాధించేందుకు పఠనోత్సవాలను ప్రారంభించింది. ఇందులో కథలు, పద్యాలను పఠింపజేయడం ద్వారా పిల్లల్లో భాషా సబ్జెక్టులపై జిజ్ఞాస, పరిజ్ఞానం పెరుగుతుంది. అలాగే జ్ఞాపకశక్తి సైతం పెంపొందే అవకాశం ఉంటుంది.
తరగతి గదిలో క్లాసులవారీగా….
విద్యాశాఖ తెలుగు, ఆంగ్ల భాషలను మాత్రమే పఠనోత్సవాల్లో భాగంగా విద్యార్థులతో ప్రకాశ పఠనం చేయించాలని ఆదేశించింది. వేములవాడ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో మాత్రం అదనంగా హిందీ భాషను కూడా చేర్చి విద్యార్థులతో చదివిస్తున్నారు. ప్రార్థన సమయంలో ప్రతిరోజు పిల్లలతో ఒక విద్యార్థితో కథ, పద్యాన్ని కూడా పఠనం చేయిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఉపాధ్యాయులు వారి వారి తరగతులకు అనుగుణంగా ప్రతిరోజూ 10 నిమిషాల పాటు ముందుగా ప్రకాశ పఠనాన్ని చేయిస్తున్నారు. అలాగే విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించే విధంగా వారంలో ఒకరోజు ప్రకాశ పఠన పోటీలు కూడా నిర్వహిస్తున్నారు.
మూడు భాషలను పఠింపజేస్తున్నాం
రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం స్కూల్లో పఠనోత్సవాలను నిర్వహిస్తున్నాం. తెలుగు ఆంగ్ల భాషను మాత్రమే చదివించాలని చెప్పగా, మేము హిందీ భాషతో కలిపి మూడు భాషలను పఠింపజేస్తున్నాం. విద్యార్థుల్లో ఆసక్తి కలిగేలా పోటీలు కూడా నిర్వహిస్తూ బహుమతులు ఇస్తున్నాం. పిల్లలు సైతం ఉత్సాహంగా పోటీల్లో పాల్గొంటున్నారు.
–సుహాసిని హెచ్ఎం, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, వేములవాడ
భాషలపై పట్టు సాధిస్తారు
ప్రభుత్వం విద్యార్థుల్లో భాషా నైపుణ్యాల పెంపునకు పఠనోత్సవాలను ప్రారంభించడం శుభపరిణామం. ఈ కార్యక్రమం ద్వారా భాషపై పట్టు పెరుగుతుంది. పదాలను తప్పులు లేకుండా ఉచ్చరించే అవకాశం ఉంటుంది. మేం సైతం పాఠశాల దశలో ఇదే పద్ధతిలో అభ్యసించాం. ఈ పద్ధతి ద్వారా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
– నమిలికొండ జయంతి శర్మ, తెలుగు టీచర్ వేములవాడ
బయటకు చదివితేనే గుర్తుంటుంది..
పాఠాలను బయటకు చదవడం ద్వారా ఎక్కువ రోజులు గుర్తుంటున్నాయి. చదువుతు న్న సమయంలో తప్పులను గుర్తించి మళ్లీ చదివిస్తున్నారు. పద్యాన్ని, కథను రెండు మూడు సార్లు చదివించడంతో భయం తొలగిపోతుంది.
– శార్వాణి, విద్యార్థిని వేములవాడ