వీణవంక, ఫిబ్రవరి 21 : పొద్దంతా యూరియా బస్తాల కోసం తిరిగితే ఎవుసం ఎట్లా సాగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరి యా బస్తాల కోసం వీణవంక మండలంలోని చల్లూరులో రైతులు శనివారం రోడ్డెక్కారు. వీణవంక-కరీంనగర్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. యాప్లో బుక్ చేసుకున్నా బస్తాలు దొరక్క పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ పొద్దంతా యూరియా కోసం తిరిగితే ఎవుసం ఎట్లా చేసుకొనేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
చల్లూరు సింగిల్విండోలో యూరియా ఉందని యాప్లో చూపిస్తే బుక్ చేసుకున్నామని, సింగిల్ విండోకు వెళ్లి అడిగితే ఇప్పుడిస్తం.. అప్పుడిస్తం అని చెప్తున్నారే గానీ, ఉదయం 10.30 దాటినా ఇవ్వలేదని మండిపడ్డారు. రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుపడ్డట్టు చరిత్రలో లేదని, ప్రభుత్వ చేతకానితనం వల్ల పనులు మానుకొని యూరియా కోసం బారులు తీరుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్పై అవగాహన లేక యూరియా అందక పంట ఎదగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని కొరత ఇప్పుడెలా? వచ్చిందని ప్రశ్నించారు. యూరియా బుక్ చేసుకుని షాపు ముందు గంటల తరబడి నిరీక్షించినా ఇచ్చేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ విధానం వెంటనే ఎత్తివేసి పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు గంట సేపు రాస్తారోకో చేయగా, అధికారులు వచ్చి నచ్చచెప్పడంతో విరమించారు. రాస్తారోకోలో దాసారపు కృష్ణ చైతన్య, యార రాజయ్య, తిరుపతి, సమ్మయ్యతోపాటు దాదాపు 200 మంది రైతులు పాల్గొన్నారు.