అంతర్గాం, నవంబర్ 3: ‘అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదు.. ఆ పార్టీది అంతా మోసపు చరిత్రే..వారికి ఓటేస్తే మన బతుకులు ఆగమవుతాయి’ అంటూ రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ విరుచుకుపడ్డారు. హస్తంపార్టీని గెలిపిస్తే మన కంటిని మనం పొడుచుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని చెప్పారు. హనుమంతుడి గుడి లేని ఊరులేదు..కేసీఆర్ పథకం అందని ఇల్లులేదంటే అతిశయోక్తికాదన్నారు. శుక్రవారం టీటీఎస్ అంతర్గాం, విలేజ్ అంతర్గాంలో కోరుకంటి ప్రజా అంకితయాత్రలో భాగంగా ముమ్మర ప్రచారం చేశారు.
ఆయాచోట్ల ఆయనకు మహిళలు మంగళహారతులిచ్చారు. గ్రామస్తులు నెత్తిన పూలవర్షం కురిపించి, డప్పు చప్పుళ్లతో సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడారు. అంతర్గాం స్పిన్నింగ్ మిల్లు మూతపడడానికి కారణం కాంగ్రెస్సేనని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలోనే అన్నివర్గాలకు మేలు జరిగిందని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత మానవీయ కోణంలో పార్టీ మ్యానిఫెస్టోను రూపొందించారని చెప్పారు. మళ్లీ గెలిపిస్తే రైతుబంధు, ఆసరా పింఛన్ల పెంపు, రూ. 400లకే గ్యాస్ సిలిండర్, రేషన్కార్డు దారులకు సన్నబియ్యం, పేద మహిళలకు ప్రతినెలా రూ. 3వేలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రజలు ఆలోచించాలని..ఈ ప్రగతి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాల్లో అంతర్గాం ఎంపీపీ దుర్గం విజయ, జడ్పీటీసీ అముల నారాయణ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, సర్పంచ్లు కర్ర వెంటకమ్మ నూకరాజు, తుంగపిండి సతీశ్, ధరని రాజేశ్, ధర్మాజీ కృష్ణ, బాదరవేని స్వామి, గంగాధరి దేమమ్మ, రాములు, మెరుగు పోశం, కో ఆప్షన్ సభ్యులు దివాకర్, గౌస్పాషా, నాయకులు తిరుపతి నాయక్, కోల సంతోష్గౌడ్, ఆర్శనపల్లి శ్రీనివాస్, ఎదులపూరం వెంకటేశ్, మల్లయ్య, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.