అతడు పుట్టుకతోనే దివ్యాంగుడు.. పోలియోతో కాలు చచ్చుబడిపోయింది.. నడవడమే కష్టమైన అతడు వైకల్యాన్ని ఎదిరించాడు.. చిన్నప్పటి నుంచి తనకిష్టమైన క్రికెట్లో రాటుదేలాడు. తల్లిదండ్రులు, స్నేహితుల ప్రోత్సాహంతో రాష్ట్ర, జాతీయ పోటీల్లో సత్తాచాటుతూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు కొదురుపాకకు చెందిన రాజశేఖర్ విజయగాథ ఇది.
-సుల్తానాబాద్రూరల్, ఫిబ్రవరి 8
సుల్తానాబాద్రూరల్, ఫిబ్రవరి 8 : పుట్టుకతోనే పోలియోబారిన పడడంతో కాలు చచ్చుబడిపోయింది. అయినా, అతడు నిరాశచెందలేదు. తనకు చిన్నప్పటి నుంచి అచ్చొచ్చిన క్రికెట్లో ప్రతిభ చూపుతున్నాడు. తల్లిదండ్రులు, గ్రామ సర్పంచ్ ప్రోత్సాహంతో సత్తాచాటుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏకైక వ్యక్తిగా కీర్తిని దక్కించుకున్నాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన సట్లు భూమయ్య-పుష్ప దంపతులకు ముగ్గురు సంతానం. పెద్దకొడుకు రాజశేఖర్ చిన్నతనంలోనే పోలియో బారినపడ్డాడు. కుడి కాలు వంకరపోయింది. తండ్రి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రాజశేఖర్కు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. స్నేహితులతో కలిసి గల్లీ క్రికెట్లో మునిగితేలేవాడు. ఒకటి నుంచి పదో తరగతి వరకు పెద్దపల్లి ట్రినిటీ పాఠశాలలో చదివాడు. 2015లో వరంగల్లో డిప్లొమా, 2018లో హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేశాడు. 2017 డిసెంబర్లో హైదరాబాద్లోని తెలంగాణ దివ్యాంగుల స్పోర్ట్స్ స్కూల్లో చేరాడు. నిత్యం నాలుగు గంటల పాటు ప్రాక్టీస్ చేసేవాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో తనదైన శైలిలో ప్రతిభ చూపేవాడు.
2018లో జరిగిన రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రికెట్ పోటీల్లో రాణించి రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. బోర్డ్ ఆఫ్ డిజెబుల్ క్రికెట్(బీడీసీఏ) అసోసియేషన్ సభ్యుడిగా ఎంపికయ్యాడు. జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని జట్టు గెలుపులో కీలక భూమిక పోషించాడు. మహారాష్ట్రలోని నాగపూర్లో 2018లో నేషనల్ పారా ఎమ్మెల్యే కప్ చాంపియన్షిప్లో జట్టు సెమీస్కు చేరడంలో ముఖ్యభూమిక పోషించారు. 2020లో జరిగిన రంజీ పోటీల్లో తెలంగా ణకు ప్రాతినిధ్యం వహించాడు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన పోటీల్లో మహారాష్ట్రపై గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఔరంగాబాద్లో 24 జట్లతో తలపడగా అందులో ప్రతిభ చూపాడు. 2021లో ఇండియా-బంగ్లాదేశ్ పోటీల్లో దేశ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. బోర్డ్ ఆఫ్ డిజెబుల్ క్రికెట్(బీడీసీఏ) అసోసియేషన్ సభ్యుడిగా ఎంపికైన రాజశేఖర్ హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి వద్ద రాజశేఖర్ పీఏ, పీఆర్వోగా పని చేశాడు. 2021 అగస్టు 3 నుంచి 2022 అక్టోబర్ 22 వరకు పనిచేశాడు. పదవీ కాలం పూర్తి కావడంతో ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నాడు.