బోయినపల్లి, జనవరి 11: తరుచూ ఆత్మహత్యలు, ప్రమాదాలు జరుగుతుండడంతో కొదురుపాక హైలెవల్ వంతెనపై కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపడుతున్నారు. రూ. కోటి నిధులతో జాలీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే బ్రిడ్జికి ఇరువైపులా యాంగులర్స్ బిగింపు పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం వంతెన మధ్యలో జాలీ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. సాధ్యమైనంత తొందరలో పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
రాజన్న సిరిసిల్ల-కరీంనగర్ జిల్లా ప్రధాన రహదారిలో కొదురుపాక మూలవాగుపై మూడేండ్ల క్రితం నీటిపారుదల, ఆర్అండ్బీ శాఖలు సంయుక్తంగా రూ.132 కోట్ల అంచనాతో హైలెవల్ వంతెనను నిర్మించారు. శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మిడ్ మానేరు) నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో పూర్తి సామర్థ్యం మేర నీటిని నిలువ చేస్తున్నారు. దీంతో వంతెన వద్ద సుమారు 8 మీటర్ల ఎత్తులో బ్యాక్ వాటర్ నిలువ ఉంటుంది. ఈ వంతెన మీదుగా నిత్యం వేలాది మంది ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలపై వేములవాడ రాజన్న ఆలయంతో పాటు, సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, వరంగల్ హన్మకొండ పట్టణాలకు ప్రయాణాలు సాగిస్తుంటారు. ఎందరో ఇక్కడ ఆగి నీటి పరవళ్లను చూస్తూ ఇక్కడి ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తుంటారు. ఈ క్రమంలో పలుమార్లు ప్రమాదాలు జరిగాయి. అంతేకాకుండా వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఎందరో క్షణికావేశంలో బలవన్మరణాలకు పా ల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతుండడంతో రక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, టీఆర్ఎస్ రాష్ట్ర నేత జోగినపల్లి రవీందర్రావును కోరారు. వీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఇటీవలే రూ.కోటి మంజూరు చేసింది. ఈ నిధులతో యాంగులర్స్ బిగింపు పనులు చేపట్టారు. సాధ్యమైనంత తొందరలో పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురానున్నారు.
జాలీల ఏర్పాటుతో ప్రమాదాలకు చెక్
కొదురుపాక హైలెవల్ వంతెనకు ఇరువైపులా, మధ్యలో జాలీల ఏర్పాటుతో ప్రమాదాలు, ఆత్మహత్యలకు చెక్ పడనున్నది. ఇక్కడ శాంతి భద్రతల నిర్వహణ, ఈ ఆత్మహత్యలు పోలీసులకు ఒక విధంగా ఇబ్బందులు పెడుతున్నాయి. రక్షణ చర్యలకు నిధులు మంజూరై నిర్మాణ పనులు జరగడం చాలా సంతోషం.
-పుల్ల అభిలాష్, ఎస్ఐ, బోయినపల్లి
రూ.కోటితో పనులు చేస్తున్నాం..
కొదురుపాక హైలెవల్ వంతెనపై జాలీల బిగింపునకు ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. ఈ బ్రిడ్జిపై నుంచి కొందరు దూకి ఆత్మహత్య చేసుకుంటున్నారని స్థానిక ప్రజా ప్రతినిధులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే రవి శంకర్తో మాట్లాడి రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన. వారు అంచనాలు రూపొందించి పంపించారు. ప్రభుత్వం 8 నెలల క్రితం నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించింది.
-జోగినపల్లి రవీందర్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు
ప్రజల శ్రేయస్సే ముఖ్యం
కొదురుపాక హై లెవల్ వంతెన వద్ద తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించిన. జాలీల బిగింపు పనులు వేగంగా సాగుతున్నాయి. నాణ్యతతో చేపట్టాలని అధికారులను ఆదేశించిన. ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ అంతిమ లక్ష్యం.
-సుంకె రవిశంకర్, ఎమ్మెల్యే చొప్పదండి