Rajanna Sircilla | కోనరావుపేట, మార్చి 17: ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఓ వృద్ధురాలి జీవితాన్ని తలకిందులు చేసింది. భర్త మరణంతో జీవనాధారం కోల్పోయిన ఆమెకు ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛన్ ఆశ్రయం కావాల్సింది పోయి, అధికారుల పొరపాటు వల్ల ఆ అవకాశమూ లేకుండా పోయింది. భర్త మరణాన్ని నమోదు చేసే క్రమంలో, సంబంధిత అధికారులు వృద్ధురాలే మృతి చెందినట్లుగా కంప్యూటర్ నమోదు చేయడంతో ఈ విపరీత పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా వివరాలిలా ఉన్నాయి..
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామానికి చెందిన వృద్ధురాలు మాదాసు నర్సవ్వ భర్త నర్సయ్య ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో భర్త పింఛన్ తనకు వస్తదని ఆలస్యంగా తెలుసుకున్న వృద్ధురాలు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లింది. అయితే ఆన్లైన్ రికార్డుల్లో వృద్ధురాలు నర్సవ్వ మరణించినట్లుగా నమోదై ఉండడంతో అధికారులు దరఖాస్తును తిరస్కరించారు. దీంతో ఆశ్చర్యానికి గురైన వృద్ధురాలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ న్యాయం చేయాలని వేడుకుంటోంది.
తాను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి సాక్ష్యాలు చూపించినా, ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవైపు వయస్సు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు తనను కుంగదీస్తున్నాయంది. అయినా పింఛన్ కోసం తిరుగుతున్నానని, రోజులు గడుస్తు న్నా సమస్యకు పరిష్కారం కనిపించడం లేదని గోడు వెల్లబోసుకుంది. ఇప్పటికైనా ఉన్న తాధికారులు స్పందించి, రికార్డులను సరిదిద్దాలని బాధితురాలు కోరు తోంది. కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రత్యేక చొరవ తీసు కుని తనకు న్యాయం చేయాలని చేతులెత్తి వేడుకుంటోంది.