వేములవాడ టౌన్, జూన్ 13: ఎములాడ రాజన్న క్షేత్రం కిక్కిరిసింది. జిల్లాతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో సోమవారం రద్దీగా మారింది. ముందుగా తలనీలాలు సమర్పించి, కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి దర్శనానికి బారులు తీరారు. కుంకుమపూజలు, గండాదీపం, పెద్దసేవ, సత్యనారాయణ వ్రతాలు, కల్యాణాల మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, ఆలయంలో రద్దీ దృష్ట్యా ఆర్జితసేవలను రద్దుచేశారు. ఆలయ ఈవో రమాదేవి, ఏఈవో శ్రీనివాస్, పర్యవేక్షకులు నాగుల మహే శ్, ఆలయ ఇన్స్పెక్టర్స్ సంకేపల్లి పవన్, చెక్కిళ్ల అశోక్, శ్రీనివాసరెడ్డి భక్తులకు ఇబ్బందులు రా కుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా, స్వామివారిని సుమా రు 35వేల మంది దర్శించుకున్నారని, ఆర్జిత సేవల ద్వారా ఆలయానికి సుమారు రూ.19 లక్షల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో పట్టణ సీఐ వెంకటేశ్ బందోబస్తు నిర్వహించారు.