సిరిసిల్ల టౌన్, నవంబర్ 19: మానేరువాగులో పడి ఆరుగురు చిన్నారులు మృతిచెందిన ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. సిరిసిల్ల మానేరువాగులో పడి మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలను శుక్రవారం వారి నివాసాలకు వెళ్లి ఆయన పరామర్శించారు. ముందుగా జడల వెంకటసాయి ఇంటికి వెళ్లి విద్యార్థి తల్లిదండ్రులు అనిల్-లీలతో మాట్లాడారు. అధైర్యపడొద్దని, మనోధైర్యంతో ఉండాలని భరోసా కల్పించారు. అక్కడి నుంచి ఇంటర్ విద్యార్థి సింగం మనోజ్ ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యార్థి తల్లిదండ్రులు చంద్రమౌళి-భాగ్యతో మాట్లాడుతూ, చేతికందిన కొడుకును కోల్పోయిన మీ బాధను ఎవరూ తీర్చలేరన్నారు. మంత్రి కేటీఆర్ అందించిన పరిహారం డబ్బులను దాచుకుని కుటుంబ అవసరాల కోసం ఉపయోగించుకోవాలన్నారు. ఆ తరువాత తీగల అజయ్ ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులు ఎల్లయ్య-దేవేంద్రకు ధైర్యం చెప్పారు. మంత్రి కేటీఆర్ సూచించిన మేరకు ఎల్లయ్యకు ఉపాధి కల్పించేలా అధికారులను ఆదేశిస్తామని భరోసానిచ్చారు. తరువాత శ్రీరాం క్రాంతికుమార్ ఇంటికి వెళ్లారు.
అతడి తల్లిదండ్రులు రమేశ్-మాలతిని పరామర్శించి, భరోసానిచ్చారు. అక్కడి నుంచి కొంగ రాకేశ్ ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులు తల్లిదండ్రులు వీరేశం-నిర్మలను పరామర్శించారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరయ్యేలా చూస్తామని చెప్పారు. మరో విద్యార్థి కొలిపాక గణేశ్ కుటుంబ సభ్యులు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో వారికి మంత్రి కేటీఆర్ ఇచ్చిన చెక్కును అందించడంతో పాటు అవసరమైన సహాయం చేయాలని స్థానిక నాయకులకు సూచించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ, చిన్నారుల మృతి వార్త వినగానే తాను నమ్మలేకపోయానని, ఇటువంటి ఘటన జరుగడం దురదృష్టకరమన్నారు. జిల్లాలోని జలాశయాల వద్ద రక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట టీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య, సెస్ మాజీ చైర్మన్ చిక్కాల రామారావు తదితరులు ఉన్నారు.