సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 6: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో క్రీడా సంబురం నెలకొన్నది. పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానం రాష్ట్రస్థాయి పోటీల పండుగకు వేదికగా మారింది. ఇప్పటికే వాలీబాల్ పోటీలు ముగియగా సత్తా చాటిన క్రీడాకారులకు జాతీయస్థాయిలో రాణించేలా శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 9 నుంచి 12 వరకు నిర్వహించనున్న కబడ్డీ పోటీలకు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. పోటీల్లో ప్రతిభ చూపేందుకు కఠోర సాధన చేస్తున్నారు.
జోరుగా శిక్షణ
గత నెల 31న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ముగిశాయి. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి 200మందికిపైగా క్రీడాకారులు తరలివచ్చారు. పురుషుల జట్టుకు 20 మంది, మహిళల జట్టుకు 18 మందిని ఎంపిక చేశారు. పురుషుల టీమ్కు అక్బర్, సంపత్, జగన్, మహిళల టీమ్కు జ్యోతి, ప్రభాకర్ కోచ్లుగా వ్యవహరిస్తున్నారు. వీరు ఏప్రిల్ 11 నుంచి 16 వరకు ఉత్తరాఖండ్లో జరిగే జాతీయస్థాయి పోటీలకు రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించనున్నారు. వీరు ఈ నెల 8వ తేదీ వరకు క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 5.30 నుంచి 9.00 గంటల వరకు సాయంత్రం 5.30 నుంచి 8 గంటల వరకు కఠోర సాధన చేయిస్తున్నారు. మాజీ, సీనియర్ క్రీడాకారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఉదయం అల్పాహారం, టీతో పాటు మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందజేస్తున్నారు.
కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు..
జిల్లా ఏర్పాటు తర్వాత సిరిసిల్లలో తొలిసారిగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ జిందం చక్రపాణి ఆధ్వర్యంలో క్రీడాకారులకు వసతులను సమకూర్చారు. సుమారు 1400 మంది క్రీడాకారులు తరలిరానున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే పోటీలకు జిల్లాలోని 20మంది పీఈటీలు, ఫిజికల్ మాస్టర్లు, మొత్తం 100 మంది నిర్వాహకులు హాజరవుతారు. సాయంత్రం వేళలో జరిగే మ్యాచ్ల కోసం ఫ్లడ్లైట్లు సిద్ధం చేశారు.
క్రీడాకారులకు సదవకాశం..
మే 22నుంచి పాట్నాలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు జరుగుతాయి. జాతీయ స్థాయిలో తెలంగాణ జట్టును విజేతగా నిలుపాలన్న లక్ష్యంతో రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నాం. ఈ పోటీల్లో సత్తాచాటిన క్రీడాకారులకు అవసరమైన కోచింగ్ను ఇక్కడే ఇస్తాం. జాతీయ స్థాయిలో తెలంగాణ జట్టు విజేతగా నిలిచే విధంగా క్రీడాకారులను తీర్చిదిద్దుతాం.
-తిరుపతి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి
కఠోర సాధన చేస్తున్న.
ఇప్పటివరకు మినీనేషనల్, సబ్ జూనియర్స్, జూనియర్స్ నేషనల్ పోటీల్లో పాల్గొన్నా. సిరిసిల్లలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన. ఈ పోటీల్లో సత్తా చాటేందుకు కఠోర సాధన చేస్తున్న. కోచ్ల సూచనలు పాటిస్తూ పోటీలకు సిద్ధమవుతున్న. కచ్చితంగా జాతీయ జట్టుకు ఎంపికవుతాననే నమ్మకం ఉన్నది.
– రంజిత్, వరంగల్ జిల్లా
విజేతగా నిలుస్తాం..
మా జిల్లా నుంచి పది మందిమి సిరిసిల్లలో జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చాం. ప్రస్తుతం జాతీయస్థాయి పోటీల కోసం జరుగుతున్న శిక్షణ శిబిరంలో మెళకువలు నేర్చుకుంటున్నాం. కోచ్లు పకడ్బందీగా శిక్షణ అందిస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి. జాతీయ స్థాయిలో ఎంపికై విజేతగా తిరిగివస్తాం.
-అక్షిత, రంగారెడ్డి జిల్లా
కేటీఆర్ ప్రోత్సాహంతో..
మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో సిరిసిల్లలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి క్రీడాకారులు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటికే పలువురు చేరుకున్నారు. వీరికి పట్టణంతో పాటు వేములవాడలో భోజనం, వసతి తదితర అన్ని ఏర్పాట్లు చేసినం. ప్రజాప్రతినిధులు, క్రీడా సంఘాలు, పోలీసుల సహకారంతో క్రీడలను విజయవంతం చేస్తం.
-జిందం చక్రపాణి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్