సిరిసిల్ల/ముస్తాబాద్/సిరిసిల్ల టౌన్/సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 14 : అర్హులైన పేదలకు నయా పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం ఇల్లు కట్టిస్తున్నదని, పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ముస్తాబాద్ మండల కేంద్రంలో రూ.9.81కోట్ల వ్యయంతో నిర్మించిన 156 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడారు. ముస్తాబాద్లో పండుగ వాతావరణం కనిపిస్తున్నదని, పైసా ఖర్చు లేకుండా పేదలకు డబుల్ బెడ్రూం అందిస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీల్లా రూపుదిద్దుకున్న డబుడ్ బెడ్రూం ఇండ్లను రూపాయి ఖర్చు లేకుండా పేదలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని ఉద్ఘాటించారు. ఈ పథకంతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు. 75 ఏండ్ల స్వతంత్ర దేశంలో రైతులకు వెన్నుదన్నుగా ఉండే పథకాలన్నీ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రాష్ట్రం మనదేనన్నారు. ప్రజా సంక్షేమం కోసం విప్లవాత్మక పథకాలను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని తెలిపారు. అర్హత ఉండి డబుల్ బెడ్రూం ఇండ్లు రాని వారికి తప్పకుండా వస్తాయని భరోసా కల్పించారు. అనంతరం లబ్ధిదారులకు వడ్డించి, వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. తర్వాత ముస్తాబాద్లోని ఎంఏఆర్ గార్డెన్లో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు కల్వకుంట్ల శ్రీనివాసరావు కూతురు వివాహనికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
పర్యటన సాగిందిలా..
సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం 11:41 గంటలకు మోహినికుంట చేరుకుని రెండు కుటుంబాలను పరామర్శించారు. మధ్యాహ్నం 12:06 గంటలకు ముస్తాబాద్లో డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 1:30 గంటలకు గూడూరులో, 1:56 గంటలకు గూడెంలో పలు అభివృద్ధి పనులను, 2:52 గంటలకు రామలక్ష్మణపల్లిలో నూతన పంచాయతీ భవనాన్ని, 3:35 గంటలకు సిరిసిల్ల రగుడు వద్దసెంట్రల్ లైటింగ్ సిస్టంను ప్రారంభించారు. సుమారు ఏడు గంటల పాటు పర్యటించగా, సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు.
గూడూరు, గూడెంలో అభివృద్ధి పనుల ప్రారంభం
ముస్తాబాద్ మండలం గూడూరులో రూ.20 లక్షలతో నిర్మించిన ‘కేసీఆర్ ప్రగతి ప్రాంగణాన్ని’ మంత్రి ప్రారంభించారు. రూ.50 లక్షలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ చేశారు. ప్రాథమిక పాఠశాలలో రూ.10 లక్షలతో నిర్మించే అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్కు ఈ గ్రామంపై ప్రత్యేక అభిమానం ఉన్నదని, సంపూర్ణ అవగాహన ఉన్నదని గుర్తు చేశారు. పట్టణాల అభివృద్ధికి వచ్చే నిధుల మాదిరిగా గూడూరు గ్రామాభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. గ్రామాభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. గూడెంలో రూ.22 లక్షలతో నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ను, అనంతరం రూ.25 లక్షలతో నిర్మించిన మోడల్ అంగన్వాడీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.30 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులకు ప్రారంభోత్సవం చేశారు. మోడల్ అంగన్వాడీలతో చిన్నారులకు ప్రజ్ఞా పాటవాలు పెరుగుతాయని సీడీపీవో అలేఖ్య మంత్రి కేటీఆర్కు వివరించారు. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా 135 మంది అంగన్వాడీ చిన్నారులకు బ్యాగులు, వాటర్ బాటిళ్లు, లంచ్బాక్స్లు అందించారు. రామలక్ష్మణపల్లిలో రూ.20లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలలో రూ.9.60 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి మరిన్ని నిధులు కావాలని ప్రజాప్రతినిధులు కోరగా, దశల వారీగా మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
సిరిసిల్లలో..
సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్య విగ్రహానికి పూలమాల వేసిన మంత్రి కేటీఆర్, అక్కడి నుంచి రగుడులోని రంగినేని ట్రస్ట్ సమీపంలో సిరిసిల్ల చౌరస్తా నుంచి రగుడు జంక్షన్ వరకు రూ.1.50 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించారు. అనంతరం సిరిసిల్ల గౌడ సంఘం అధ్వర్యంలో నిర్వహిస్తున్న సిద్దోగం వేడుకలో పాల్గొన్నారు. ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ.23 లక్షలతో నిర్మించిన గౌడ సంఘం భవనాన్ని ప్రారంభించారు. ఇక్కడ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్ర నారాయణగౌడ్, నాయకులు బండారి శ్రీనివాస్గౌడ్, బాలసాని అంజయ్య గౌడ్, పరకాల అంజయ్య గౌడ్, బుర్ర రామచంద్రంగౌడ్ పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో సిద్దోగం వేడుకలకు మంత్రి హాజరై, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నేతలు మంత్రిని సన్మానించారు. అనంతరం గంభీరావుపేట మండలం జగదాంబతండాలో నిర్వహిస్తున్న వీరాంజనేయ విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాల్లో పాల్గొని పూజలు చేశారు. గంభీరావుపేటలోని టీఆర్ఎస్ నాయకుడు వెంకటస్వామిగౌడ్ కుమారుడి రిసెప్షన్కు హాజరయ్యారు. అనంతరం దేశాయిపేటలో ఎల్లమ్మ ఆలయ నిర్మాణం కోసం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమాల్లో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరు ప్రవీణ్, రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ మాజీ చైర్మన్, వెలమ సంఘం జిల్లా అధ్యక్షులు చిక్కాల రామారావు, కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అకునూరి శంకరయ్య, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, టీపీఏఎస్సీ సభ్యులు చంద్రశేఖర్రావు, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్రావు, పోత్గల్ సింగిల్విండో చైర్మన్ తన్నీరు బాపురావు, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్, సెస్ డైరెక్టర్లు విజయరామారావు, కుంభాల మల్లారెడ్డి, ఏఎంసీ చైర్మన్ జానాబాయి, సర్పంచ్లు గాండ్ల సుమతి, రవీందర్రెడ్డి, రమేశ్, సరిత, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కిషన్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యాది మల్లేశ్, నేతలు పూర్ణచందర్రావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మోహినికుంటలో బెడ్రూం ఇండ్లు బాగున్నాయి
గేటెడ్ కమ్యూనిటీ మాదిరిగా మోహినికుంటలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు బాగున్నాయని మంత్రి కేటీఆర్తో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కన్వీనర్ విమలక్క సంతోషం వెలిబుచ్చారు. సోమవారం ముస్తాబాద్ ఎంఎఆర్ గార్డిన్లో జరిగిన పెళ్లి వేడుకకు అమాత్యుడు హాజరయ్యారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న విమలక్క, మాజీ జనశక్తి నేత అమర్ కలిసి కాసేపు ముచ్చటించా రు. బెడ్రూం ఇండ్లు సొంతంగా నిర్మించుకున్న ఇండ్ల లెక్క ఉన్నాయని, ఒక్క మోహినికుంటనే కాదు రా ష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇండ్లు బాగున్నాయని విమలక్క చెప్పారు. ఇటీవల దుబ్బాకక వెళ్తుండగా, మార్గంమధ్యంలో రోడ్డు పక్కన ఇండ్లు బాగుండడంతో ఆగి లబ్ధిదారులతో మాట్లాడానని చెప్పారు. సొంతంగా కట్టుకున్నారా..? అని లబ్ధిదారులను అడిగితే ప్రభుత్వం తమకు ఇచ్చిందని చెప్పారని, తనకు చాలా సంతోషమనిపించిందని వివరించారు. దీంతో విమలక్కకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అక్కడే ఉన్న జనశక్తి అగ్రనేత అమర్తో ‘మీరు తెలంగాణ ఉద్యమకాలంలో రాసిన పాటను ఎల్లారెడ్డిపేటలో నిర్వహించిన వేదికలో విమలక్క పాడగా విన్నాను’ అని మంత్రి గుర్తు చేసుకున్నారు.