సిరిసిల్ల రూరల్, నవంబర్ 11: అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)తో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని ఏటీసీ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ఏటీసీలోని సీ ఎన్ సీ మ్యాచింగ్ టెక్నీషియన్, ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్, ఇండస్ట్రీయల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ టెక్నీషియన్, మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ టెక్నీషియన్, మెకానిక్ ఎలెక్ట్రిక్ వెహికల్, వర్చువల్ అనాలిసిస్ అండ్ డిజైనర్ ఎఫ్ఈఎం కోర్సుల్లో బాగంగా వివిధ యంత్రాలపై శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు.
ఎక్కడి నుంచి వస్తున్నారు? విద్య బోధన, ప్రాక్టికల్ అంశాలపై పలు ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. వివిధ కోర్సుల ల్యాబ్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..యువత ఏటీసీ సెంటర్లు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తరగతులకు వచ్చే విద్యార్థులు ప్రతి అంశాన్ని లోతుగా తెలుసుకోవాలని, ప్రాక్టికల్ ను కూడా నిత్యం సాధన చేయాలని సూచించారు. ఈ దశలో నేర్చుకున్న అంశాలు ఉద్యోగానికి, వృత్తి జీవితంలో ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి నిముషం విలువైనదని, తరగతులను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ కవిత, తహసీల్దార్ జయంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.